లారెన్స్ ట్రస్ట్ హాస్టల్లో 20 మందికి కరోనా!
on May 27, 2020
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న హాస్టల్లో 20 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. చెన్నైలోని అశోక్నగర్లో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోన్న హాస్టల్లోని 20 మంది కోవిడ్-19 పాజిటివ్గా తేలినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ హాస్టల్ను 2006లో లారెన్స్ ప్రారంభించాడు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు చెందిన ఒక అధికారి చెప్పిన దాని ప్రకారం ఆ హాస్టల్లో మొత్తం 25 మంది ఉంటున్నారు.
"మేం చేపట్టిన ఇంటింటి సర్వేలో భాగంగా మా ఆరోగ్య కార్యకర్తలు శనివారం లారెన్స్ నడుపుతున్న హాస్టల్ను సందర్శించారు. అక్కడున్న వారిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. వారిలో 20 మందికి కోవిడ్-19 సోకినట్లు సోమవారం వెల్లడైంది. వారందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించాం" అని ఆయన చెప్పారు. ఈ పరిణామం తర్వాత ఆ హాస్టల్ చుట్టూ కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటుచేశారు. ఆ భవనంలోకి బయటివాళ్లనెవరినీ ప్రవేశించకుండా దాన్ని మూసివేశారు.
సామాజిక సేవలో భాగంగా తనపేరిట ట్రస్ట్ను నెలకొల్పిన లారెన్స్, దాని ఆధ్వర్యంలో పలు అనాథాశ్రమాలు, దివ్యాంగుల ఆవాసగృహాలు ఏర్పాటు చేయడమే కాకుండా, పేదలకు విద్యా సౌకర్యాలు, గుండె శస్త్రచికిత్సలు వంటివి అందిస్తూ వస్తున్నాడు.