మే 28న నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభం
on May 21, 2022
మే 28న మహానాయకుడు, మహానటుడు నందమూరి తారకరామారావు శత జయంతి సంవత్సరం మొదలవుతోంది. ఈ సందర్భంగా నేల నలుచెరగులా ఉన్న తెలుగు వారందరూ ఆయనను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఓ లేఖ ద్వారా తెలియజేశారు. ఈనెల 28 నుంచి 2023 మే 28 వరకు 365 రోజుల పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని ఆయన వెల్లడించారు.
శనివారం వెలువరించిన ఈ లేఖలో ఆయన, "అభిమానులకు.. తెలుగునేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి.. నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి." అంటూ లేఖను ప్రారంభించారు బాలయ్య. "మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది... మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది. ఆనందంలో పాలుపంచుకుంటుంది." అని ఆయన చెప్పారు.
తమ కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారని తెలిపిన ఆయన, "అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను.. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత." అని అన్నారు. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాననీ, అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను తన చేతులమీద ప్రారంభిస్తాననీ వెల్లడించారు.
"365రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను.. అహర్నిశలు మీ అభిమానం కోసం.. మీ నందమూరి బాలకృష్ణ." అని ఆయన రాసుకొచ్చారు.