ప్రభుదేవా వారసుడు వచ్చేశాడు.. వేదికపై తండ్రితో కలిసి స్టెప్పులేసిన రిషిదేవా!
on Feb 27, 2025
వారసత్వం అనేది ప్రతి రంగంలోనూ ఉంటుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాల్లోని వారసత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రజలతో ఎక్కువ సంబంధం కలిగి ఉన్న ఈ రెండు రంగాల్లో వారసులు అనేకమంది వచ్చారు. సినిమా రంగం విషయానికి వస్తే హీరోల నుంచి టెక్నీషియన్స్ వరకు ఎంతో మంది తమ వారసుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. హీరోల వారసులు టెక్నీషియన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి, అలాగే టెక్నీషియన్ల వారసులు హీరోలు అయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా సినీ రంగంలో మరో వారసుడు రాబోతున్నాడు. తన డాన్స్తో అన్ని భారతీయ భాషల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ ప్రభుదేవా తన కుమారుడు రిషి దేవాను ప్రజలకు పరిచయం చేశారు. ఇటీవల జరిగిన ఒక డాన్స్ ఈవెంట్లో తన కుమారుడు రిషిదేవాను పరిచయం చేయడమే కాకుండా కొడుకుతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు ప్రభుదేవా.
సుందరం మాస్టర్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఎన్నో గొప్ప సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు సుందరం మాస్టర్. ఆయన తనయులు రాజు సుందరం, ప్రభుదేవా, నాగేంద్రప్రసాద్ కూడా డాన్స్ మాస్టర్లు మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రాజు సుందరం, ప్రభుదేవా టాప్ హీరోలుగా ఉన్నవారందరి సినిమాలకు పనిచేశారు. రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు. తండ్రి నృత్య వారసత్వాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజు సుందరం, ప్రభుదేవా మాదిరిగానే రిషి దేవా కూడా మంచి కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు.
ప్రభుదేవా, రిషిదేవా ఒకే వేదికపై కలిసి డాన్స్ చేయడాన్ని ఈవెంట్కి వచ్చినవారంతా ఎంతో ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. తన కొడుకుతో కలిసి డాన్స్ చేసిన వీడియోను షేర్ చేస్తూ ‘నా కొడుకు రిషిదేవ్ని పరిచయం చేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇది కేవలం నృత్యం కాదు, ఇది ఒక వారసత్వం, ఒక అభిరుచి. ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అంటూ ఆ పోస్ట్కి క్యాప్షన్ను యాడ్ చేశారు ప్రభుదేవా. రిషి దేవాకు నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రభుదేవా మాదిరిగానే రిషిదేవా మంచి డాన్సర్గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
