Jolly O Gymkhana review: జాలీ ఓ జింఖానా మూవీ రివ్యూ
on May 16, 2025
మూవీ: జాలీ ఓ జింఖానా
నటీనటులు: ప్రభుదేవా, మడోన్నా సెబాస్టియన్, పూజిత పొన్నాడా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, యాషికా ఆనంద్ తదితరులు
ఎడిటింగ్: రమర్
సినిమాటోగ్రఫీ: ఎమ్ సి గణేశ్ చంద్ర
మ్యూజిక్: అశ్విన్ వినయగమూర్తి
నిర్మాతలు: రాజేంద్ర ఎమ్ రాజన్
రచన, దర్శకత్వం: శక్తి చిదంబరం
ఓటీటీ: ఆహా
ప్రభుదేవా ప్రధాన పాత్రలో మడోన్నా సెబాస్టియన్, పూజిత పొన్నాడ, అభిరామి, యోగిబాబు కలిసి నటించిన 'జాలీ ఓ జింఖానా' గతేడాది డిసెంబర్ లో తమిళంలో రిలీజైంది. నిన్నటి నుండి ప్రముఖ ఓటీటీ 'ఆహా' లో రిలీజైంది.
కథ:
చెన్నైలోని ఓ చర్చికి భవాని వెళ్తుంది. అక్కడి ఫాదర్ కి తను చేసిన తప్పుకి ప్రయాశ్చితం కావాలని కోరుకుంటుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవాని, శివాని, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్తో హోటల్లో లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు. తంగసామి ఆపరేషన్ కోసం దాదాపు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని భవాని అక్కచెల్లెళ్లతో డాక్టర్ చెప్తాడు. అనూహ్యంగా ఆ డబ్బు భవాని అకౌంట్లో డిపాజిట్ అయి, ఆపరేషన్ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్ ఓ కేస్ విషయమై న్యాయవాది పూన్జుండ్రన్తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్ విషయమై పూన్జుండ్రన్ని కలవమని భవానీ వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్ గదిలో పడి ఉంటాడు. పూన్జుండ్రన్ని చంపిందెవరు? అతని బాడీతో భవాని అక్కచెల్లెళ్ళు తమ సమస్యని పరిష్కరించుకున్నారా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు సినిమా ప్రారంభంలోనే ఓ హింట్ ఇచ్చాడు. లాజిక్స్ ఏమీ పట్టించుకోకుండా కడుపుబ్బా నవ్వుకోవాలంటే మా సినిమా చూడండి అని చెప్పాడు. అన్నట్టుగానే కథ సాగుతుంది. హీరో ఎలా చనిపోయాడో, ఎవరు చంపారో తెలియదు.. మరోవైపు భవాని తన చెల్లెళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తూ పడే ఇబ్బందులు, మధ్యలో ఎదురయ్యే పాత్రలు కాస్త నవ్వు తెప్పించేలా ఉన్నాయి. రఘుబాబు, యోగిబాబు పాత్రలని సరిగ్గా వాడుకుంటే బాగుండేది. ఇక సినిమా చివర్లో అసలెందుకు ఆ ఇరవై లక్షలు అకౌంట్ లో ఉన్నాయో చెప్తూ కాస్త డ్రాగ్ చేశారు. అది కాస్త మైనస్ అనే చెప్పాలి.
సినిమా చూస్తున్నంతవరకు నవ్వుకోవాలని దర్శకుడు అనుకున్నాడో ఏమో కానీ ఆడియన్స్ కి మాత్రం నరకమే. క్రింజ్ కామెడీలా అనిపిస్తుంది. బలవంతంగా నవ్వు తెప్పించే సీన్లు చాలానే ఉన్నాయి. ఓ ఇరవై ఏళ్ళ క్రితమే కమల్ హసన్, రమ్యకృష్ణ కలిసి పంచతంత్రం సినిమాలో ఈ కామెడీని పండించారు. అయితే ఇది దానిలో సగం కూడా లేదు. పైగా కామెడీ సీన్లు తేలిపోయాయి. ఇక పాటలైతే అంతగా సెట్ గా కాలేదు. అసలు బిజిఎమ్ ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేదు.
ఇండివిడ్యువల్ గా ఒక్కో క్యారెక్టర్ బాగనే చేసిన కథపరంగా సెట్ అవ్వలేదు. కామెడీ అని ల్యాగ్ చేసి చుక్కలు చూపించారు. సినిమా మొత్తంలో ఇది బాగుంది అనేలా ఏదీ లేదు. అడల్ట్ సీన్లు లేవు. అశ్లీల పదాలు వాడలేదు. ఫ్యామిలీ కలిసి చూసేలా ఉంది. రమర్ ఎడిటింగ్ ఒకే. ఎమ్ సి గణేశ్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. అశ్విన్ వినయగమూర్తి మ్యూజిక్ అంతగా సెట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ఫాదర్ గా యోగిబాబు, పూన్జుండ్రన్ గా ప్రభుదేవా, భవానీగా మడోన్నా సెబాస్టియన్ అభిరామి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : జస్ట్ ఒకే విత్ క్రింజ్ కామెడీ
రేటింగ్ : 2.25 / 5
✍️. దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
