పెళ్ళయిన 20 ఏళ్ళ తర్వాత కూడా విడాకులు తప్పవా? టెన్షన్లో సూపర్స్టార్ అభిమానులు!
on Apr 16, 2024
ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అభిప్రాయ భేదాలు రావడం, పరస్పర అంగీకారంతోనే విడిపోవడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది జనరేషన్ వల్ల వచ్చిన మార్పు కాదు. సినిమా రంగంలో మొదటి నుంచీ ఉంది. అయితే పెళ్ళయిన తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాలు కాపురం చేసి, ఇద్దరు పిల్లలు కూడా కలిగిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది. అన్ని సంవత్సరాలు కలిసి ఉన్న జంట విడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? అందరిలోనూ ఇదే ప్రశ్న మెదులుతోంది. ఆ ఇద్దరూ ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఒకరు ధనుష్, మరొకరు సూపర్స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్.
ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. 18 సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితం సజావుగానే నడిచింది. కానీ, సడన్గా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. 2022లో వీరిద్దరూ తీసుకున్న నిర్ణయానికి ఇండస్ట్రీ షాక్ అయింది. కొన్ని కారణాల వల్ల తామిద్దరం ఇకపై కలిసి జీవించలేమని డిసైడ్ అయ్యారట. అయితే అలా విడిపోవడానికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత అందరి కంటే ఎక్కువ షాక్ అయింది రజినీకాంతే. వారి సమస్య ఏమిటో తెలుసుకొని ఇద్దరికీ సర్దిచెప్పాలని, కలిసి ఉండేలా చెయ్యాలని రజినీ ఎంతో ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. గత రెండేళ్ళుగా ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు. పిల్లలు మాత్రం ఐశ్వర్య దగ్గరే ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు తండ్రి దగ్గరకు వెళ్ళి వస్తుంటారు.
ఈ రెండేళ్ళుగా చట్టపరంగా విడిపోయేందుకు ఇద్దరూ ప్రయత్నించలేదు. కొన్నిరోజుల క్రితమే ఇద్దరూ చెన్నయ్ ఫ్యామిలీ కోర్డులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతోనే తాము విడాకులు కోరుకుంటున్నామని ఆ దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను ఏప్రిల్ 15న జడ్జి సుభాదేవి విచారణకు స్వీకరించారు. అక్టోబర్ 7న ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరిరాజా కుమారుడు ధనుష్. అతని సోదరుడు సెల్వరాఘవన్ కూడా తమిళ్, తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించి మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి లోటుపాట్లు లేని ఫ్యామిలీ వారిది. అలాగే రజినీకాంత్ ఫ్యామిలీకి ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాలకు చెందిన ధనుష్, ఐశ్వర్య పెళ్ళయిన 20 సంవత్సరాల తర్వాత విడిపోవాలని డిసైడ్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వారి పిల్లల్లో పెద్దవాడికి 18 సంవత్సరాలు, చిన్నవాడికి 14 సంవత్సరాలు. ఈ సమయంలో తల్లిదండ్రులు విడిపోవడం అనేది బాధాకరమని ధనుష్, అభిమానులు, రజినీకాంత్ అభిమానులు అంటున్నారు. అక్టోబర్ 7న వీరిద్దరినీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు వీరి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందా? లేక విడాకులు మంజూరు చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read