మొన్న ఎన్టీఆర్.. నేడు రిషబ్.. ఇద్దరికీ బిగ్ షాక్!
on May 22, 2025
బయోపిక్ ట్రెండ్ కొంతకాలంగా ఊపందుకుంది. బయోపిక్ లు చేయడానికి స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకే బయోపిక్ కోసం ఒకే సమయంలో ఇద్దరు స్టార్స్ పోటీపడటం అనేది ఇటీవల చూస్తున్నాం.
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 'మేడ్ ఇన్ ఇండియా' ప్రకటన వచ్చింది. రాజమౌళి సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడని వార్తలొచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా మరో సినిమా తెరకెక్కనుందని, ఇందులో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని తెలిసి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ బయోపిక్ ని ఎన్టీఆరే ముందు చేస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి వచ్చింది.
రిషబ్ శెట్టి టైటిల్ రోల్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ను గతేడాది చివరిలో ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా.. 2027 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీనికంటే ముందే మరో ఛత్రపతి శివాజీ బయోపిక్ థియేటర్లలో అడుగుపెట్టనుంది.
'రాజా శివాజీ' పేరుతో ప్రముఖ నటుడు రితేష్ దేశ్ముఖ్ స్వీయ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ బయోపిక్ ను తాజాగా అనౌన్స్ చేశాడు. జ్యోతి దేశ్పాండే, జెనీలియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మే 1న మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇది ఓ రకంగా రిషబ్ శెట్టికి షాక్ అనే చెప్పాలి.
శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో సంచలన వసూళ్లు సాధించింది. ఆ ఉత్సాహంతోనే శివాజీ బయోపిక్ కి రితేష్ శ్రీకారం చుట్టినట్టున్నాడు. ఈ సినిమా కూడా ఛావా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తే.. రిషబ్ శెట్టి ప్రాజెక్ట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
