థియేటర్ల బంద్ ఇష్యూలో కొత్త ట్విస్ట్.. అతన్ని కాపాడటం కోసమే దిల్ రాజు ఇదంతా చేశాడా..?
on May 28, 2025
థియేటర్ల బంద్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు మొదట వార్తలొచ్చాయి. అయితే జూన్ 12న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా విడుదలవుతుండంతో.. కొందరు కుట్రతోనే ఈ బంద్ కి తెరలేపారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటర్న్ గిఫ్ట్ అంటూ డిప్యూటీ సీఎం ఆఫీస్ ఘాటుగానే స్పందించారు. దాంతో అల్లు అరవింద్, దిల్ రాజు వంటి బడా నిర్మాతలు మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే ధైర్యం ఎవరికీ లేదని, థియేటర్ల బంద్ నిర్ణయం ఏప్రిల్ లోనే తీసుకున్నారని, మిస్ కమ్యూనికేషన్ వల్ల ఏపీ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్లిందని చెప్పుకొచ్చారు.
థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఎవరున్నారనే విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. తన సొంత పార్టీ వారున్నా చర్యలు తప్పవని చెప్పారు. అన్నట్టుగానే.. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి నగర నియోజకవర్గం ఇంచార్జి అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేశారు.
ఈ అంశంపై తాజాగా మీడియాతో మాట్లాడిన అత్తి సత్యనారాయణ.. దిల్ రాజుపై విమర్శలు గుప్పించాడు. "ఏప్రిల్ 19న తూర్పు గోదావరిలో ఈ బంద్ నిర్ణయం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిందని దిల్ రాజు నా మీద అభాండం వేశారు. అసలు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డినే జూన్ 1న థియేటర్ల బంద్ అని తొడ కొట్టి మరీ ప్రకటించాడు. తమ్ముడిని కాపాడుకోవడం కోసమే దిల్ రాజు నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు." అని అత్తి సత్యనారాయణ చెప్పుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
