తారక్ని ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి?
on Feb 23, 2021
`మాస్టర్`, `ఉప్పెన` చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ కోలీవుడ్ స్టార్ ని.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో విలన్ గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఆర్ ఆర్ ఆర్` తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ సోషల్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే. సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ సినిమాలోని ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని నటింపజేసేందుకు యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని వినికిడి. త్వరలోనే `యన్టీఆర్ 30`లో విజయ్ సేతుపతి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. తారక్ ని విజయ్ సేతుపతి ఢీ కొడతారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`యన్టీఆర్ 30`ని యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.