అప్పుడు పవన్.. ఇప్పుడు వైష్ణవ్.. !
on Sep 14, 2021
విష్ణువర్ధన్.. తమిళనాట స్టైలిష్ మేకింగ్ కి పెట్టింది పేరు. `తల` అజిత్ తో `బిల్లా`(2007), `ఆరంభం` (2013) వంటి బ్లాక్ బస్టర్స్ ని రూపొందించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. తెలుగులోనూ ఓ స్ట్రయిట్ పిక్చర్ తీశాడు. ఆ చిత్రమే.. `పంజా` (2011). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
కట్ చేస్తే.. పదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరో తెలుగు సినిమా చేయబోతున్నాడట విష్ణువర్థన్. ఈ సారి పవన్ మేనల్లుడు, `ఉప్పెన` స్టార్ వైష్ణవ్ తేజ్ తో ఈ చిత్రం ఉండబోతోందని టాక్. అంతేకాదు.. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు. అలాగే, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందని బజ్. త్వరలోనే వైష్ణవ్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, విష్ణు తాజా చిత్రం `షేర్షా` ఇటీవల ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయింది. సిద్ధార్ధ్ మల్హోత్రా, కియారా అద్వాని జంటగా నటించిన ఈ సినిమా.. విష్ణుకి తొలి హిందీ చిత్రం. తన శైలి టేకింగ్ తో ఈ బయోపిక్ ని జనరంజకంగా తీర్చిదిద్ది ప్రశంసలు అందుకుంటున్నాడు విష్ణు. ఆ సినిమా అందించిన నూతనోత్తేజంతోనే టాలీవుడ్ లోనూ మరో ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. మరి.. తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ చూసిన విష్ణు.. తెలుగులోనూ అదే బాట పడతాడేమో చూడాలి.