బన్నీ-కొరటాల మూవీని హడావిడిగా అనౌన్స్ చేశారా?
on Aug 3, 2020
మూడు రోజుల క్రితం అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ మూవీని అనౌన్స్ చేసిన విషయం మనకు తెలుసు. ఈ సినిమా ద్వారా సుధాకర్ మిక్కిలినేని అనే నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఆయన కొరటాల స్నేహితుడు. కాగా ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్మెంట్ ఫిల్మ్నగర్లో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. కారణం.. కొరటాల ప్రస్తుతం చిరంజీవి టైటిల్ రోల్లో 'ఆచార్య' మూవీ చేస్తుండటం, ఆ సినిమాకు సంబంధించి ఇంకా చాలా షూటింగ్ చేయాల్సి ఉండటం. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే బన్నీతో ఆయన కాంబినేషన్ మూవీని ఇంత హడావిడిగా ఎందుకు అనౌన్స్ చేశారంటూ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
మహేశ్తో చేసిన 'భరత్ అనే నేను' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు కొరటాల. చిరంజీవి 'సైరా.. నరసింహారెడ్డి' ప్రాజెక్ట్తో బిజీగా ఉండటంతో ఆ సినిమా పూర్తయ్యేంత దాకా ఆయన కోసం ఎదురుచూశాడు. ఎట్టకేలకు 'ఆచార్య' షూటింగ్ ఈ ఏడాది జనవరిలో మొదలైంది. 'భరత్ అనే నేను' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2018 ఏప్రిల్లో. అంటే కొరటాలకు దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చిందన్న మాట. ఇంతకాలం చిరంజీవి సినిమా కోసమే ఆయన టైమ్ వెచ్చించాడు. ఇప్పుడు కరోనా గోలతో షూటింగ్లు ఆగిపోవడంతో మళ్లీ ఖాళీ అయ్యాడు కొరటాల. దీంతో అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు.
వరుసగా టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ నంబర్వన్ రేంజికి దూసుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బన్నీ.. అందులో భాగంగా కొరటాలతో కమిట్ అయ్యాడు. నిజానికి 'జనతా గ్యారేజ్' తర్వాత మరోసారి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి పనిచేయాలని ఇదివరకు కొరటాల భావించాడు. సుధాకర్ మిక్కిలినేనిని ఆ కాంబినేషన్తో నిర్మాతను చేయాలనుకున్నాడు. కానీ బన్నీ ఎంట్రీతో సీన్ మారిపోయింది. పైగా ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ను తగ్గించుకొనేందుకు కూడా బన్నీ సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. దీన్ని కొరటాల తనకు అనుకూలంగా మలచుకున్నాడంటున్నారు.
వాళ్ల మధ్య కుదిరిన డీల్ ప్రకారం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురికీ మూడు సమాన భాగాలుగా లాభాలు అందనున్నాయి. అంటే ఈ ప్రాజెక్టుతో కొరటాల భారీగా లాభపడనున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. తన ఆచార్య ప్రాజెక్ట్ ఇంకా సగం కూడా పూర్తి కాకమునుపే బన్నీతో కొరటాల సినిమా అనౌన్స్ చేయడంపై చిరంజీవి అసంతృప్తితో ఉన్నారని మెగా క్యాంప్ నుంచి వినవస్తోంది.
Also Read