'ప్రేమిస్తే' సీక్వెల్.. హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ కొడుకు!
on Jan 29, 2022
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేశారు ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో RC15 తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన వారసులు సినీ పరిశ్రమలో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శంకర్ కూతురు అదితి శంకర్.. కార్తీ సరసన ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో శంకర్ కొడుకు అర్జిత్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
2004లో శంకర్ నిర్మించిన 'కాదల్' సినిమా తమిళనాట సంచలనం సృష్టించింది. భరత్, సంధ్య జంటగా శక్తివేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ 'ప్రేమిస్తే' పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. శంకర్ నిర్మించనున్న ఈ సీక్వెల్ మూవీతోనే అర్జిత్ హీరోగా పరిచయం కానున్నాడని సమాచారం.
మరి శంకర్ వారసులు వెండితెరపై ఏ స్థాయిలో సత్తా చాటుతారో చూడాలి.