'భీమ్లా నాయక్' దర్శకుడితో నితిన్ మూవీ!
on Jun 21, 2022
'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న సాగర్ కె.చంద్ర.. ఇటీవల పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన 'భీమ్లా నాయక్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమాతో ఆకట్టుకున్న సాగర్.. తన కొత్త సినిమాని ఇంకా ప్రకటించలేదు. అయితే ఆయన యంగ్ హీరో నితిన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నితిన్ కెరీర్ ఒక హిట్, మూడు ప్లాప్ లు అన్నట్లుగా సాగుతోంది. 2016 లో 'అఆ'తో ఘన విజయాన్ని అందుకున్న నితిన్ ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలతో నిరాశపరిచాడు. అలాగే 2020లో వచ్చిన 'భీష్మ'తో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. గతేడాది వచ్చిన 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో' సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఏడాది ఆగష్టు 12న 'మాచెర్ల నియోజవర్గం' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్న నితిన్.. వక్కంతం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
'అప్పట్లో ఒకడుండేవాడు' తరహాలో నితిన్ కోసం సాగర్ ఓ విభిన్న కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో నితిన్ ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.
Also Read