వన్స్ మోర్.. రజినీ, అజిత్ బాక్సాఫీస్ వార్
on May 3, 2021
2019 పొంగల్ కి `తలైవా` రజినీకాంత్, `తల` అజిత్ బాక్సాఫీస్ వద్ద తలపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. 2019 జనవరి 10న `పేట్ట`తో రజినీకాంత్ పలకరించగా.. అదే రోజున `విశ్వాసమ్`తో అజిత్ సందడి చేశారు. ఇద్దరు కూడా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించారు. కట్ చేస్తే.. 2021లో వీరిద్దరు మరోసారి బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `విశ్వాసమ్` దర్శకుడు `శౌర్యం` శివ కాంబినేషన్ లో `అణ్ణాత్తే` పేరుతో రజినీకాంత్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని దీపావళి సందర్భంగా నవంబర్ 4న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడదే రోజున అజిత్ కొత్త చిత్రం `వలిమై`ని రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. `ఖాకి` దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తొలుత ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో జాప్యం చోటు చేసుకోవడంతో.. ఇప్పుడు దీపావళిని లక్ష్యం చేసుకున్నారట.
మరి.. 2019 పొంగల్ కి వసూళ్ళ వర్షం కురిపించిన రజినీ, అజిత్.. 2021 దీపావళికి కూడా అదే ఫీట్ రిపీట్ చేస్తారేమో చూడాలి.