ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. ఇది కదా న్యూస్ అంటే..!
on Jun 11, 2025
'పుష్ప-2'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ (Allu Arjun).. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత 'పుష్ప-3' చేసే అవకాశముంది. ఈ రెండు సినిమాల తర్వాత.. బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.
త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ మైథలాజికల్ ఫిల్మ్ చేయాల్సి ఉండగా.. అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. గతంలో సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా ప్రకటించాడు బన్నీ. కానీ, ఆ మూవీ కూడా దాదాపు లేనట్టే. ఈ రెండు ప్రాజెక్ట్ లు మిస్ అవ్వడం పట్ల బన్నీ ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ ఉంది. ఇలాంటి సమయంలో ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడట. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారం.
దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని ఇటీవల బన్నీ చెప్పాడు. మరోవైపు ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో.. దిల్ రాజు ఓ మూవీ ప్లాన్ చేశాడు. కానీ, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రభాస్ తో సినిమా అంటే కొన్నేళ్లు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్- ప్రశాంత్ నీల్ కాంబోని దిల్ రాజు సెట్ చేసినట్లు వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు.
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది. ఆ తర్వాత బన్నీ-నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. ఒకవేళ అట్లీ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప-3' చేస్తే.. ఈలోపు ప్రశాంత్ నీల్ మరో సినిమా చేసే ఛాన్స్ ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
