విజయ్-పూరి కాంబోలో మరో మూవీ.. హీరోయిన్ గా జాన్వీ కపూర్!
on Jan 26, 2022
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'. ఈ సినిమా రిజల్ట్ పై మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అందుకేనేమో ఈ మూవీ ఇంకా విడుదల కాకముందే విజయ్-పూరి మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో విజయ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందని టాక్ వినిపిస్తోంది.
'లైగర్' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. అయితే ఆమె ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే లైగర్ తర్వాత విజయ్-పూరి కాంబినేషన్ లో రానున్న మూవీలో మాత్రం జాన్వీ కపూరే హీరోయిన్ అని తెలుస్తోంది. ఈ జనరేషన్ ఇండియన్ స్టార్స్ లో తనకి విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని, అతనితో నటించాలని ఉందని గతంలో జాన్వీ చెప్పింది. పూరి డైరెక్షన్ లో వస్తున్న లైగర్ లో విజయ్ సరసన నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు విజయ్-పూరి కాంబోలో రానున్న మరో ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. జాన్వీ కూడా ఈసారి విజయ్ సరసన నటించే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని భావిస్తోందట.
కాగా లైగర్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
Also Read