బుచ్చిబాబు దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ!!
on Jul 28, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఫలానా దర్శకుడితో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ చేయనున్నాడంటూ వార్తలు రావడం.. చివరికి అవి ప్రచారంగానే మిగిలిపోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తుంది. ఇటీవల 'ఆదిత్య 369' సినిమా సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని.. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞ కనిపిస్తాడని కూడా టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
మోక్షజ్ఞ ఒక కొత్త కథ ద్వారా సోలోగానే తెలుగు తెరకి పరిచయం కానున్నాడని తెలుస్తోంది. మోక్షజ్ఞతో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగిందని అంటున్నారు. మొదటి సినిమా 'ఉప్పెన'తో భారీ హిట్ అందుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. మైత్రీ బ్యానర్ లో వచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' సినిమా ఘన విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో బుచ్చిబాబుతో మరో సినిమా తీయడానికి మైత్రీ సిద్ధమైంది. బుచ్చిబాబు చెప్పిన స్టొరీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావించిన మైత్రీ బాలకృష్ణతో సంప్రదింపులు జరుపుతుందని సమాచారం.
కాగా బుచ్చిబాబు 'ఉప్పెన' మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. తారక్ ని కలిసి కథ కూడా విపించాడని ప్రచారం జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస పాన్ ఇండియా మూవీస్ కమిట్ అవుతున్న తారక్.. ఇప్పట్లో బుచ్చిబాబుతో సినిమా చేయడం కష్టమనే చెప్పాలి. అందుకే బుచ్చిబాబు మరో హీరో వేటలో పడ్డాడని అంటున్నారు.