‘అజ్ఙాతవాసి’లో వెంకీ ఇలా ఉంటాడు..?
on Dec 26, 2017
‘దేవుడా... ఓ మంచి దేవుడా... తినడానికి తోట కూరపప్పిచ్చావ్... తాగడానికి నీళ్లిచ్చావ్... వేసుకోడానికి బట్టలిచ్చావ్... గీసుకోడానికి గడ్డమిచ్చావ్... ’ అంటూ ‘నువ్వు నాకు నచ్చావ్’లో వెంకీ చేసిన హంగామా అంతా ఇంతానా? అసలు ఆ సినిమాలో వెంకీ కామెడీకి నవ్వని వాళ్లుంటారా?
ఇక ‘మల్లీశ్వరి’లో పెళ్లి కాని ప్రసాద్ పాత్ర. అసలు వెంకీలో కామెడీ టైమింగ్ ఈ రేంజ్ లో ఉందా? అని జనాలకు తెలిసింది ఈ రెండు సినిమాల ద్వారానే. ఈ రెండు సినిమాలకూ మాటలు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. వెంకీలోని కామెడీ టైమింగ్ కి... త్రివిక్రమ్ డైలాగుల్లోని రైమింగ్ కీ జనాల పొట్టలు చక్కలయ్యాయ్. అసలు వెంకటేశ్ తో ఎలాంటి సినిమాలు చేయాలో... వెంకీ పాత్రలను ఎలా డిజైన్ చేయాలో... ఎలాంటి సినిమాలు వెంకటేశ్ తో చేస్తే విజయం తథ్యమో త్రివిక్రమ్ కి బాగా తెలుసు. అందుకే...ఆ సినిమాలు అంతటి విజయాలు అందుకున్నాయ్.
మళ్లీ ఇన్నాళ్లకు ‘అజ్ఙాతవాసి’ సినిమా కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. వైరైటీ ఏంటంటే.... గతంలో చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు దర్శకుడు విజయభాస్కర్. ఆ సినిమాలకు రచయిత మాత్రమే త్రివిక్రమ్. ప్రస్తుతం చేస్తున్న ‘అజ్ఙాతవాసి’ సినిమాకు దర్శకుడు కూడా త్రివిక్రమే. అంటే... త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ తొలిసారి నటిస్తున్నాడన్నమాట. ఇందులో హీరో వెంకీ కాకపోవడం మరో విశేషం.ఇందులో పవర్ స్టార్ హీరో. వెంకీది గెస్ట్ రోల్ అంతే.
మరి ఈ ప్రత్యేక పాత్రను త్రివిక్రమ్ ఏ విధంగా డిజైన్ చేశాడు? అసలు ఈ పాత్రను ఎలా ఉంటుంది? ఈ విషయాలను తెలుసుకోవాలని తెలుగువన్ ప్రయత్నించింది. దీనిపై ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయ్.
ఇందులో వెంకీ... పవర్ స్టార్ కు మేనమామగా చేస్తున్నాడు. చూడ్డానికి అన్నదమ్ముల్లా కనిపించే వెంకటేశ్, పవన్ కల్యాణ్ ఇందులో మేనమామ, మేనల్లుళ్లగా నటించడం మరో విశేషం. పాత్ర కోసం ఎలాంటి సాహసమైనా చేయడం వెంకీ నైజం. అందుకే... కాస్త ఏజ్ బార్ పాత్ర అయినా... వేరే హీరో సినిమా అయినా...చేయడానికి ‘సై’ అనేశాడు. అంతేకాదు...ఈ పాత్ర కోసం వైట్ హెయిర్లో కనిపిస్తాడట వెంకీ.
మరో విషయం ఏంటంటే... వెంకీ ఉన్నంత సేపూ... కథలో వెంకీనే హీరో. అలా డిజైన్ చేశాడట త్రివిక్రమ్. వారి కలయికలలో వచ్చిన గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో కామెడీ ఉంటుందని తెలిసింది.
ఈ ఒక్క రీజన్ చాలదూ...సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వానికి?