ఆ పండగ రేస్లో `పుష్ప`?
on May 1, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రానున్న తొలి పాన్ - ఇండియా మూవీ `పుష్ప`. ఇందులో గత చిత్రాలకు భిన్నంగా సాగే పాత్రలో దర్శనమివ్వనున్నారు బన్నీ. `ఆర్య`, `ఆర్య 2` తరువాత తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో `నేషనల్ క్రష్` రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్నాళ్ళ క్రితం అధికారిక ప్రకటన చేసింది యూనిట్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా నిర్మాణంలో జాప్యం చోటుచేసుకోవడంతో.. విజయదశమి పర్వదినం సందర్భంగా సినిమాని విడుదల చేసేందుకు `పుష్ప` యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో `పుష్ప` తెరకెక్కుతోంది.