బాలయ్య 'అఖండ' సక్సెస్ మీట్ కి మహేష్!
on Dec 7, 2021
నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. జాతరను తలపించేలా మాస్ ప్రేక్షకులు థియేటర్స్ కి తరలి వస్తుండటంతో అఖండ భారీ లాభాలను సాధించడం ఖాయమనిపిస్తోంది. అఖండకు వస్తున్న రెస్పాన్స్ ఆ మూవీ టీమ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఉత్సాహం నింపింది. ఇక సక్సెస్ జోష్ లో ఉన్న మూవీ టీమ్ త్వరలో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట. దీనికి చీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నాడని టాక్ వినిపిస్తోంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ దాటిన 'అఖండ' ప్రభంజనం!
'అఖండ' విడుదల రోజే ఆ మూవీకి వస్తున్న రెస్పాన్స్ పై మహేష్ సంతోషం వ్యక్తం చేశాడు. మూవీ టీమ్ కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. అలాగే ఓటీటీ వేదిక ఆహాలో బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో మహేష్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు అఖండ సక్సెస్ మీట్ కి కూడా చీఫ్ గెస్ట్ గా మహేష్ రానున్నాడని ప్రచారం జరుగుతోంది. బాలయ్య, మహేష్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఇన్వైట్ చేయగానే సక్సెస్ మీట్ కి రావడానికి మహేష్ ఓకే చెప్పాడని సమాచారం.
Also Read: 'అన్స్టాపబుల్'లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించిన బాలయ్య!
మరోవైపు 'అఖండ' సక్సెస్ మీట్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరుకానున్నాడని వార్తలొస్తున్నాయి. గతంలో తారక్-బాలయ్య 'ఎన్టీఆర్ బయోపిక్', 'అరవింద సమేత'తో పాటు పలు వేడుకల్లో వేదిక పంచుకున్నారు. అలాగే తారక్-మహేష్ 'భరత్ అనే నేను' వేడుకలో వేదిక పంచుకోవడంతో పాటు.. తారక్ హోస్ట్ చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేష్ పాల్గొన్నారు. మరి ఇప్పుడు అఖండ సక్సెస్ మీట్ పుణ్యమా అని బాలయ్య-మహేష్-తారక్ ముగ్గురూ ఒకే వేదికపై సందడి చేస్తారేమో చూద్దాం.