రాజమౌళి తర్వాత కొరటాలే!
on Jun 15, 2022
'మిర్చి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ మొదటి నాలుగు సినిమాలతో విజయాలు అందుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన తన ఐదో సినిమా 'ఆచార్య'తో మొదటి పరాజయాన్ని అందుకున్న కొరటాల తన తదుపరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఇద్దరి నెక్స్ట్ సినిమాలకు కొరటాలే డైరెక్టర్ కావడం విశేషం. కొరటాల డైరెక్ట్ చేసిన మెగా మల్టీస్టారర్ 'ఆచార్య'లో చిరంజీవితో కలిసి చరణ్ నటించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమాకి కూడా కొరటాలే దర్శకుడు. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే చరణ్, తారక్ బాటలోనే మహేష్ కూడా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.
తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న మహేష్.. 29వ సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే మహేష్ తన 30వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి కొరటాల దర్శకుడిగా వ్యవహరిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మహేష్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' విజయాన్ని అందుకున్నాయి. ఈ ప్రచారం నిజమైతే ఇది వీరి కాంబోలో రానున్న మూడో సినిమా అవుతుంది.
నిజానికి రాజమౌళితో సినిమా చేసిన హీరోకి నెక్స్ట్ సినిమా ప్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. కానీ కొరటాల మాత్రం వరుసగా రాజమౌళి హీరోలతో సినిమాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 'ఆచార్య'తో షాక్ తిన్న కొరటాల.. 'NTR30'తో ఎలాగైనా హిట్ కొట్టి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.