సంక్రాంతి కాదు.. దసరాకే `సర్కారు వారి పాట`?
on Apr 16, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. `భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో జోష్ మీదున్న మహేశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సోషల్ డ్రామాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు `గీత గోవిందం` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఆ అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది ఘట్టమనేని వారి అభిమానులకు.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట`ని సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అంతకంటే ముందే ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుందట. ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్.. `అతడు`, `ఖలేజా` తరువాత మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళి.. 2022 వేసవికి రిలీజ్ చేయాలని మహేశ్ - త్రివిక్రమ్ ద్వయం ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే.. `సర్కారు వారి పాట`ని చకచకా పూర్తిచేయాలని మహేశ్ మరింత స్పీడ్ పెంచారట. దీంతో.. సంక్రాంతికి రావాల్సిన `సర్కారు వారి పాట` దసరా సమయంలో థియేటర్ల బాట పట్టే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, త్రివిక్రమ్ సినిమా తరువాతే దర్శకధీరుడు రాజమౌళి కాంబో మూవీని పట్టాలెక్కిస్తారట మహేశ్.