కొడుకు కోసం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తనున్న రిచెస్ట్ పొలిటీషన్
on Jun 5, 2017
కర్ణాటక మాజీ మినిస్టర్ గాలి జనార్దన్ రెడ్డి... దాదాపు ఈ పేరు తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు. స్టార్ సెలబ్రిటీలకి ఎంత క్రేజ్ ఉందో, గాలి కుటుంబానికి అంతే పాపులారిటీ ఉంది. బాత్రూంతో సహా ఇంట్లో ఎక్కడ చూసినా బంగారుమయమే, అది జనార్దన్ రెడ్డి రాజవైభోగం అంటే. నోట్ల రద్దు సమయంలో కూడా, తన కూతురు పెళ్లిని మునుపెన్నడూ వినని, చూడనంత అంగరంగ వైభవంగా చేసి, నేషనల్ మీడియా లో మైలేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ రిచెస్ట్ పొలిటీషన్ తన కొడుకు కోసం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తనున్నాడు.
జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డికి చిన్నప్పటి నుండి సినిమాలంటే ప్రాణం. ఒక రకంగా గాలి కుటుంబంలో జరిగే వేడుకలకి సినిమా సెలెబ్రిటీలకి ప్రత్యేక ఆహ్వానం అందడంలో కిరీటిది ప్రధాన పాత్ర అంటారు. తన అక్క పెళ్ళిలో కిరీటి చేసిన డాన్సులు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారాయి. అందరూ మెచ్చుకోవడంతో ఇంక ఆగలేక హీరో అవుతాననే తన చిరకాల వాంఛ తండ్రి ముందు ఉంచాడంట. వద్దు అనడానికి గాలి జనార్దన్ రెడ్డి ఏం సాదా- సీదా వ్యక్తి కాదు కదా... కొడుకు అడిగిందే ఆలస్యం, ఎవరో ఏంటి నేనే నీ సినిమా నిర్మిస్తానని హామీ ఇచ్చి, ప్రస్తుతం మంచి దర్శకుడు, కథ కోసం చూస్తున్నారంట. పోయిన సంవత్సరం, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కొడుకు నిఖిల్ గౌడని పరిచయం చేస్తూ జాగ్వర్ అనే తెలుగు-కన్నడ సినిమాని భారీ స్థాయిలో తీశారు. కానీ, అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి కిరీటి మొదటి సినిమాతో సక్సెస్ కొడతాడా లేదో చూద్దాం.