మంజులను "ముందు చీర సరిగా కట్టుకో" అన్న ఎంజీఆర్!
on Sep 15, 2021
గ్లామరస్ హీరోయిన్గా ఒకప్పుడు మంజుల ఓ వెలుగు వెలిగారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నాయికగా రాణించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు లాంటి టాప్ స్టార్స్ సరసన నటించారు. అయితే హీరోయిన్గా ఆమె పరిచయమైన చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎంజీఆర్! అవును. తమిళ చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా రాణించిన ఎంజీఆర్ సినిమా 'రిక్షాకారన్'లో ఆమె తొలిసారి హీరోయిన్గా దర్శనమిచ్చారు. ఆ సినిమాలో మంజులకు అవకాశం లభించడం చాలా చిత్రంగా జరిగింది.
ఒక పత్రిక కోసం మద్రాసులోని విజయా గార్డెన్స్లో ఫొటోగ్రాఫర్ కె.ఆర్.వి. భక్త ఆమె స్టిల్స్ తీస్తున్నప్పుడు, అక్కడే ఎంజీఆర్ సినిమా 'నమ్నాడు' షూటింగ్ జరుగుతోంది. మంజులను ఆయన గమనించి, ఆమెను పిలుచుకురమ్మని తన మేకప్మ్యాన్ పీతాంబరంను పంపారు. ఆయన వచ్చి, "ఎంజీఆర్ గారు అక్కడ షూటింగ్లో ఉన్నారు, నిన్ను పిలుచుకు రమ్మన్నారు" అని చెప్పారు. అంతే.. ఫస్ట్ టైమ్ చీర కట్టుకొని ఉన్న మంజుల, చీర జారిపోతున్నా పట్టించుకోకుండా ఆనందంతో తబ్బిబ్బవుతూ ఆయన దగ్గరకు పరిగెత్తారు. తన దగ్గరకు ఆయాసపడుతూ వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యపోయిన ఎంజీఆర్, "ముందు చీర సరిగా కట్టుకో" అని చెప్పారు. కానీ ఆమె ఆయన చేతిని గిల్లుతూ, "కలా, నిజమా! మీరు ఎంజీఆర్ గారేనా!" అని సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.
ఆమె ప్రవర్తనకు ఆయన మరింత ఆశ్చర్యపోయి, "ముందు మీ అమ్మగారిని రమ్మను, మాట్లాడదాం" అన్నారు. ఆ తర్వాత మంజుల అమ్మగారితో మాట్లాడిన ఎంజీఆర్, తన బ్యానర్లో ఆర్టిస్టుగా మంజుల చేత ఐదేళ్లు ఒప్పందం రాయించుకున్నారు. అలా ముందుగా 'రిక్షా కారన్' సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన సరసన నాయికగా నటించారు మంజుల. ఆయన సంస్థలో ఉన్న ఐదేళ్లలోనూ నటన, నృత్యం, సంభాషణోచ్ఛారణ లాంటి అంశాల్లో ఆమెకు శిక్షణ ఇప్పించారు ఎంజీఆర్. తాను స్వయంగా కూడా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె తొలిసారి హీరోయిన్గా నటించిన 'రిక్షాకారన్'లో నటనకు గాను ఎంజీఆర్కు ఉత్తమ నటునిగా భరత్ అవార్డు లభించడం విశేషం.
Also Read