నటుడిగా ఓ వెలుగు వెలిగిన రంగనాథ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలుసా?
on Jul 17, 2025
(జూలై 17 నటుడు రంగనాథ్ జయంతి సందర్భంగా..)
సినిమా అనేది ఓ విచిత్ర ప్రపంచం. అందులోనూ సినిమా వారి జీవితాలు మరింత విచిత్రంగా ఉంటాయి. ఎవరి జీవితం ఎలా సాగుతుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో చివరికి ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో అందంగా సాగిపోతున్న జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడం, దాంతో ఒక్కసారిగా వారు అంధకారంలోకి జారిపోవడం మనం చూశాం. అలా నటుడు రంగనాథ్ జీవితం విషాదాంతంగా ముగిసింది.
రంగనాథ్ పూర్తిపేరు.. తిరుమల సుందర శ్రీ రంగనాథ్. 1949 జూలై 17న టీఆర్ సుందర రాజు, టీఆర్ జానకి దేవి దంపతులకు జన్మించిన రంగనాథ్.. అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. ఆ ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభావంతో ఎదుగుతూ.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో బీఏ డిగ్రీ పట్టా పొందారు. ఆ అర్హతతోనే భారత రైల్వేస్ లో టికెట్ కలెక్టర్గా ఉద్యోగం పొందిన రంగనాథ్ ని.. రంగుల ప్రపంచం ఎంతగానో ఆకర్షించింది.
ఈ క్రమంలోనే.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో దిగ్గజ దర్శకుడు బాపు రూపొందించిన ‘బుద్ధిమంతుడు’ సినిమాలో రంగనాథ్కి చిన్న వేషం దక్కింది. 1969లో రిలీజైన ఈ సినిమా తరువాత వెంటనే అవకాశాలు రాకపోయినా.. 1974లో రూపొందిన ‘చందన’లో కథానాయకుడి పాత్ర దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న రంగనాథ్.. ఆపై ‘జమీందారు గారి అమ్మాయి’, ‘పల్లెసీమ’, ‘పంతులమ్మ’, ‘రామచిలుక’, ‘అమెరికా అమ్మాయి’, ‘అందమే ఆనందం’, ‘మా ఊరి దేవత’, ‘దేవతలారా దీవించండి’, ‘ఇంటింటి రామాయణం’ వంటి సినిమాల్లో హీరోగా నటించారు.
హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ సరైన సినీ నేపథ్యం, ప్రోత్సహించేవారు లేకపోవడంతో తన అర్హతకు తగ్గ స్థాయికి వెళ్ళలేకపోయారు. అయినప్పటికీ నిరాశపడక తనను వరించిన అవకాశాలతో ముందుకు సాగారు. ‘ఎర్రమల్లెలు’, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘ఇది కాదు ముగింపు’ వంటి ఆలోచనాత్మక చిత్రాల్లో ఆకట్టుకున్న రంగనాథ్.. ‘ఖైదీ’, ‘పల్నాటి సింహం’, ‘అడవి దొంగ’, ‘కలియుగ కృష్ణుడు’, ‘దొంగ మొగుడు’, ‘అంతిమ తీర్పు’, ‘స్టేట్ రౌడీ’, ‘ముత్యమంత ముద్దు’, ‘కొండవీటి దొంగ’, ‘కొదమ సింహం’, ‘బృందావనం’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘స్నేహితులు’, ‘ప్రేమకు వేళాయెరా’, ‘కలిసుందాం.. రా’ వంటి సూపర్హిట్ సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో ‘మొగుడ్స్ పెళ్ళామ్స్’ చిత్రాన్ని రూపొందించి దర్శకుడుగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
ఓ పక్క సినిమాలు చేస్తూనే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘భాగవతం’తో బుల్లితెరపై తొలిసారిగా మెరిసిన రంగనాథ్.. ఆపై దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన టీవీ సీరియల్ ‘శాంతి నివాసం’తో సందడి చేశారు. ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’, ‘ఇద్దరు అమ్మాయిలు’, ‘అత్తో అత్తమ్మ కూతురో’, ‘మొగలిరేకులు’ వంటి ధారావాహికల్లో కూడా రంజింపజేశారు. మొత్తంగా.. నాలుగు దశాబ్దాలకి పైగా సినీ జీవితంలో 300కి పైగా చలనచిత్రాల్లో కథానాయకుడిగా, సహాయకనటుడిగా, ప్రతినాయకుడిగా, గుణచిత్ర నటుడిగా పలు వేషాల్లో మురిపించారు రంగనాథ్.
వెండితెర జీవితంలో తన అభినయంతో వెలుగులు పంచిన రంగనాథ్.. నిజజీవితంలోనూ భర్తగా, తండ్రిగా బాధ్యాతయుతంగా ముందుకు సాగారు. తన శ్రీమతి తిరుమల చైతన్య ఓ ప్రమాదం కారణంగా వీల్ ఛైర్ కే పరిమితమైన సమయంలో.. నాలుగేళ్ళ పాటు భర్తగా పలు సపర్యలు చేశారు రంగనాథ్. అయితే 2009లో శ్రీమతి తిరుమల చైతన్య తనువు చాలించాక.. రంగనాథ్ ఆలోచనాధోరణి మారిపోయింది. భార్యావియోగంతో ఒంటరి జీవితాన్ని గడపలేక సతమతమైన ఆయన.. 2015 డిసెంబర్ 19న తన ఆలోచన శైలికి భిన్నంగా ఆత్మహత్య చేసుకున్నారు. అలా.. ఓ విషాదాంత సినిమాలా ఆయన జీవితం ముగిసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
