సీనియర్ స్టార్స్ కాంబోలో రణ్ బీర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్!
on Jul 2, 2022
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కించిన బయోగ్రాఫికల్ ఫిల్మ్ `సంజు`(2018)తో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ ఆఖరిసారిగా ఎంటర్టైన్ చేశారు. కట్ చేస్తే.. ప్రస్తుతం రణ్ బీర్ చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వాటిలో రెండు సినిమాలు కేవలం 50 రోజుల్లో తెరపైకి రాబోతున్నాయి. ఈ రెండు కూడా విభిన్న కథాంశాలతో సీనియర్ స్టార్స్ కాంబోలో రూపొందినవే కావడం విశేషం. అంతేకాదు.. తెలుగులోనూ ఈ చిత్ర ద్వయాలు అనువాద రూపంలో అలరించనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్ బీర్ ద్విపాత్రాభినయంలో రూపొందిన సినిమా `షంషేరా`. పిరియడ్ యాక్షన్ ఫిల్మ్ గా తయారైన ఈ చిత్రంలో సీనియర్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించగా.. వాణీ కపూర్ నాయికగా దర్శనమివ్వనుంది. జూలై 22న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రాబోతోంది. ఇక `షంషేరా` విడుదలైన 50వ రోజున అంటే సెప్టెంబర్ 9న రణ్ బీర్ యాక్ట్ చేసిన `బ్రహ్మాస్త్రః పార్ట్ వన్ శివ` రిలీజ్ కానుంది. రణ్ బీర్ కి జోడీగా అతని శ్రీమతి ఆలియా భట్ నటించిన ఈ ఫాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ లో సీనియర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించారు. అయన్ ముఖర్జీ ఈ భారీ బడ్జెట్ మూవీకి దర్శకుడు.
మరి.. కేవలం 50 రోజుల వ్యవధిలో సీనియర్ స్టార్స్ కాంబోలో రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో రణ్ బీర్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.