సమ్మర్ హీరో ఎవరు....?
on Mar 26, 2011
మన తెలుగు సినీ పరిశ్రమకు సీజన్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నుండి మొదలవుతుంది. సంక్రాంతి బరిలో మామూలుగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ అయిపోయిమది కనుక వేసవి శలవుల సీజన్ లో మళ్ళీ సినీ పరిశ్రమ కన్నేస్తుంది. ఈ వేసవి శలవుల్లో తెలుగు ప్రేక్షకులకు సినీ పరిశ్రమ బంపర్ ఆఫర్లనే ఇస్తూంది. పెద్ద హీరోల సినిమాలు విడుదలకు బాగానే రంగం సిద్ధమవుతోంది.
యంగ్ టైగర్ యన్ టి ఆర్ తన "శక్తి" చిత్రంతో ఈ బంపర్ ఆఫర్ మొట్టమొదట మొదలెడుతున్నాడు. ఇలియానా హీరోయిన్ గా, సోనూ సూద్, జాకీ ష్రాఫ్, ఒకప్పుడు "కామసూత్ర" యాడ్ లో నటించిన డేరింగ్ సెక్సీ లేడీ పూజా బేడీ, అందాల మంజరి ఫడ్నిస్ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించగా, మెహేర్ రమేష్ దర్శకత్వంలో, 45 కోట్ల ఖర్చుతో, 300 మంది యూనిట్ సభ్యులతో, 18 నెలల పాటు అత్యంత భారీగా, శక్తి పీఠాల నేపథ్యంలో జరిగే కథతో, మెగా నిర్మాత అశ్వనీదత్ ఈ "శక్తి" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రెల్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీని తర్వాత ఏప్రెల్ 21 వ తేదీన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం విడుదల కానుంది. దీనికి 20 కోట్ల బడ్జెట్ అని వినపడుతోంది. హీరో ప్రభాస్ తొలిసారి ఒక రొమాంటిక్ హీరోగా, ఒక డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
"మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం విడుదల కాగానే ఏప్రెల్ 29 వ తేదీన రెండు కుర్ర హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ పతాకంపై, యువ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న "100%లవ్" చిత్రం కాగా, మరొకటి రానా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న "నేను - నా రాక్షసి" చిత్రం మరొకటి.
ఈ రెండు విడుదల కాగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం ఏప్రెల్ చివరి వారంలో విడుదలవుతుంది. ఈ చిత్రం బాలీవుడ్ లో సుపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్'' అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా వస్తోంది. ఈ చిత్రంలో త్రిష, కృతి కర్బంద హీరోయిన్లుగా నటిస్తూండగా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తుండగా, గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీని తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తూండగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో 40 కోట్ల భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ పతాకంపై, అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రంలో అమదాల తార మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిన్ని కృష్ణ అద్భుతమైన కథనందించగా, అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెల 19 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్.
శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "వీర". ఈ చిత్రం కూడా మే నెలలోనే విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ చిత్రం తర్వాత సమ్మర్ స్పెషల్ చిత్రంగా యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తున్న "అధినాయకుడు" ( ఈ పేరు ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు) చిత్రం జూన్ 10 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సలోనీ, మంజరి ఫడ్నీస్, పాయల్ ఘోష్, స్నేహ హీరోయిన్లుగా నటిస్తున్నారట. పరుచూరి మురళీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యమ్.యల్.కుమార్ చౌదరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
మరి ఇంతమంది హీరోల ఇన్ని చిత్రాలు విడుదలవుతుండగా వీటిలో ఏ హీరో నటించిన చిత్రం హిట్టవుతుందో, ఏ హీరో నటించిన చిత్రం ఫట్టవుతుందో, ఈ సమ్మర్ హీరో ఎవరవుతారో, ఎంతమంది హీరోలవుతారో.... ఎంతమంది జీరోలవుతారో రానున్న వేసవికాలం చెపుతుంది.