English | Telugu
ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కీర్తి భట్!
Updated : Dec 19, 2022
బిగ్ బాస్ సీజన్-6 లో ఈ సారి కూడా అమ్మాయిలకు నిరాశే మిగిలింది. టాప్-3 లో ఉన్న కీర్తి భట్.. టైటిల్ గెలవకపోయినా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది కీర్తి భట్. 'కార్తీక దీపం' సీరియల్ తో బుల్లితెరపై కనిపించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఒక యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయి.. ఆ తర్వాత ఒంటరిగా మిగిలిన తను ఒక పాపని అడాప్ట్ చేసుకుంది. అనారోగ్యంతో ఆ పాప కూడా చనిపోయింది. దీంతో తను ఇష్టపడిన ప్రతీది తనకు దూరం అవుతున్నా కూడా ఎక్కడ కూడా కృంగిపోకుండా, పైకి లేచి నిలబడింది. ఇక్కడ దాకా వచ్చింది. హౌస్ లోకి వచ్చాక కూడా తనని ఎవరూ పట్టించుకోకుండా ఉండేవారు హౌస్ మేట్స్. అయినప్పటికీ తను కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. చివరి వరకూ పోరాడుతూ వచ్చి.. టాప్-3 లో నిలిచింది.
అయితే రవితేజ హౌస్ లోకి వచ్చి 30 లక్షల మనీ ఆఫర్ ఇచ్చినప్పుడు, కీర్తి తీసుకొని వచ్చేయొచ్చు. కానీ తను అలా చేయలేదు. ప్రేక్షకుల ఓటింగ్ ని గౌరవిస్తూ వారికి కట్టుబడి ఉండి, నిజాయితీగా ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చింది. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చాక ఆదిరెడ్డి కూడా కీర్తి గురించి చెప్పాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ "కీర్తీ.. నువ్వు చాలా టఫ్ అమ్మ. చాలా స్ట్రాంగ్. వేలికి గాయం అయినా సరే టాస్క్ లు ఆడి గెలిచావ్. నీలా ధైర్యంగా ఉంటే ఎవరూ కూడా సూసైడ్ చేసుకోరమ్మా.. హ్యాట్సాఫ్ టు యూ" అని చెప్పాడు. దీంతో నాగార్జునతో పాటుగా కంటెస్టెంట్స్ అందరూ చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో కీర్తి భట్ ప్రస్థానం.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.