English | Telugu
ఒక్కటైన అక్కచెల్లెళ్ళు.. కొత్తకోడలికి అడుగడుగునా అవమానం!
Updated : Aug 24, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-497లో.. అప్పు తనను అర్థం చేసుకోవడం చూసి కావ్య ఎమోషనల్ అవుతుంది. కోడలు కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన అపర్ణ కంగారు పడుతుంది. నువ్వు ఎవరిని వదిలిపెట్టి ఉండలేవు కదా.. ఎప్పటికైనా కళ్యాణ్, అప్పులను ఇంట్లో అడుగుపెట్టేలా చేసేది నువ్వే అని కావ్యకు సర్ధిచెబుతుంది.
తన కోసం మాత్రమే తల్లి ధాన్యలక్ష్మి షాపింగ్ చేసిందని తెలిసి కళ్యాణ్ బాధపడతాడు. అమ్మ నా కోసం మాత్రమే షాపింగ్ చేసి అప్పుని మరిచిపోయిందని, తనకు కోడలు ఉందని కూడా గుర్తించడం లేదని బాధపడతాడు. ధాన్యలక్ష్మి మారిపోయిందని కళ్యాణ్కు సర్ధిచెప్తుంది ఇందిరాదేవి. నిజంగా మారిపోయిందైతే చిన్న చీర విషయానికే అప్పును అంతగా అవమానించేది కాదని కళ్యాణ్ బాధపడతాడు. అప్పు చీర కట్టుకొని కిందకొస్తుంది. ఎలాగైనా అప్పును అవమానించాలని ధాన్యలక్ష్మి భావిస్తుంది. అప్పు కంగారు పడుతుంటంతో ఆ దుష్టశక్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని స్వప్న, కావ్య అంటారు. అప్పు, కావ్య, స్వప్న సంబరంగా మాట్లాడుకోవడం చూసి రాజ్ ఆనందపడతాడు. ఎప్పుడు ఇలాగే ఉంటే ప్రతిరోజు పండగలానే ఉంటుందని అపర్ణ, ఇందిరాదేవి అనుకుంటారు. అందరం ఒకే చోట ఉంటే ఈ సంతోషం ఇలాగే ఉంటుందని కళ్యాణ్ కి రాజ్ చెప్తాడు.
పూజకు అవసరమైన సామాగ్రి తీసుకురావడానికి కిచెన్లోకి వస్తుంది అప్పు. అక్కడే ధాన్యలక్ష్మి ఉండటంతో ఆమెను అత్తయ్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. అప్పు చేత ముత్తయిదవులకి జ్యూస్ ఇప్పిస్తుంది ధాన్యలక్ష్మి. ఆ జ్యూస్ ఓ ముత్తయిదువుపై పడేలా ధాన్యలక్ష్మి, రుద్రాణి ప్లాన్ చేస్తారు. కాసేపటికి కావాలనే అప్పు ఇదంతా చేసిందని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇంటికి వచ్చిన ముత్తయిదువులను ఎలా చూసుకోవాలో తెలియదా, బొత్తిగా అడివిమనిషిలా ఉన్నావని అవమానిస్తుంది. మీ అమ్మ నిన్ను ఊరి మీదికి వదిలేస్తే ఇలాంటి బుద్దులే వస్తాయని ముత్తయిదువలు కూడా అప్పును అవమానిస్తారు. మీ ఇంటికి ఉన్న పేరును నీ కోడలు వీధిన పడేసేలా కనిపిస్తుందని ధాన్యలక్ష్మితో అంటారు. దాంతో మా కళ్యాణ్ కూడా తొందరపడి అప్పును పెళ్లిచేసుకొని మా కొంప ముంచాడని ధాన్యలక్ష్మి అంటుంది. కావాలనే అప్పును రెచ్చగొట్టి గొడవ పెద్దది చేయాలని ముత్తయిదువులు చూస్తారు. కానీ కళ్యాణ్కు ఇచ్చిన మాట కోసం అప్పు మౌనంగా ఉంటుంది. భార్యకు తన కళ్ల ముందే అవమానం జరగడం కళ్యాణ్ సహించలేకపోతాడు.
అప్పుకు ఇందిరాదేవి సపోర్ట్ చేస్తుంది. ఇంటి గుట్టును పదిమందికి ప్రసాదంలా పంచుతున్నావని ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. ఆవిడ గ్లాస్ సరిగ్గా పట్టుకోలేదని, ఇందులో నీ తప్పేం లేదని అప్పుతో ఇందిరాదేవి అంటుంది. మీ అత్త కళ్లకు పొరలు కప్పి ఉండటంతో అది గుర్తించలేదని చెబుతుంది. ఆ తర్వాత వ్రతంలో ఎవరి కొడుకు, కోడలు వెనుక వాళ్ల అత్తగారు కూర్చోవాలని చెబుతుంది. అప్పు, కళ్యాణ్ వెనుక కూర్చోవడానికి ధాన్యలక్ష్మి అంగీకరించదు. ప్రకాశం వార్నింగ్ ఇవ్వడంతో కూర్చుంటుంది. వ్రతం ఎలాంటి గొడవలు లేకుండా పూర్తవ్వడం చూసి ఇంట్లో వాళ్లు అందరు ఆనందపడతారు. ముత్తయిదువులకు భోజనం వడ్డించే సమయంలో అప్పులోని తప్పులను ధాన్యలక్ష్మి ఎత్తిచూపుతుంది. వారికి వ్రతం భోజనం పెడుతున్నావా...పిండం భోజనం పెడుతున్నావా.. ఇంత చిన్న విషయం కూడా తెలియదా అంటు ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.