English | Telugu
'కంచె' ఆడియో రిలీజ్ హైలైట్స్
Updated : Sep 18, 2015
మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్. ప్రగ్యాజైశ్వాల్ జంటగా నటించిన సినిమా ‘కంచె’.ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మించారు. గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి విలక్షణ చిత్రాలతో టాలీవుడ్ లోనే కాకుండా రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ‘గబ్బర్’ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం(సెప్టెంబర్ 17న) హైదరాబాద్లో జరిగింది. ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది.
బిగ్ సీడీని మెగాపవర్ స్టార్ రామ్చరణ్, ఆడియో సీడీలను సీతారామశాస్త్రి విడుదల చేశారు. తొలి సీడీని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అందుకున్నారు. ఈ సందర్భంగా...
వరుణ్ మంచి గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు:
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మాట్లాడుతూ ‘’ఈ రోజు కంచె ఆడియో వేదికలా కాకుండా సీతారామశాస్త్రిగారిని గౌరవించుకునేలా ఈ వేదికలా ఉంది. ఇవాళ ఉన్న పెద్ద, అప్కమింగ్ డైరక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ సినిమాలు చేయాలని అడగలేదు. నేను ఐదేళ్ళుగా సినిమా చేద్దామని క్రిష్ని అడుగుతున్నా. నేను ప్రకాష్, రానా, క్రిష్ అందరం ఒక బ్యాచ్. ఒకరోజు క్రిష్ కథ ఉందని చెబితే ఇంటికి రమ్మన్నా. వచ్చి కథ చెప్పాడు. సెకండాఫ్ కథ చెప్పడానికి రాలేదు. ఆ సబ్జెక్ట్ కి నేను సెట్ కానని అనుకున్నాడా? లేక ఆ కథనే వరుణ్తో తీశాడా? అని అనుకున్నాను. ఒకవేళ అదే కథని వరుణ్తో తీసుంటే క్రిష్ అయిపోతాడు.(నవ్వుతూ..). కెమెరామేన్ బాగా చేశారు. వరుణ్ హైట్ చూస్తుంటే నాకు అన్నయ్యలాగా ఉన్నాడు. మా ఫ్యామిలీలో మంచి అందగాడే కాదు, మంచి గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు. ప్రగ్యాకి మంచి పేరు వస్తుంది. టీమ్ కి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
అభిమానులందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది
హీరో వరుణ్తేజ్ మాట్లాడుతూ ''సినిమా యుద్ధ నేపథ్యంలో జరిగే సినిమా అయినా అవుటండ్ అవుట్ ప్యూర్ లవ్స్టోరి. ఇటువంటి సినిమాలో నటించే అవకాశం రావడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఈ కథను రియాల్టీలో పెట్టి సినిమాగా చేయడమనేది చాలా కష్టం. కానీ క్రిష్ సులభంగా చేశారు. 1940ల్లోని ప్రతి సీన్ ను సినిమాటోగ్రాఫర్ బాబా అందంగా చూపించారు. ఆయన విజన్ చూసి చూసి చాలా ఆనందించాను. మా పెదనాన్న చిరంజీవిగారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేనే. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకి థాంక్స్ తప్ప ఏమీ చెప్పుకోలేను. డాడీ మంచి సినిమా చేస్తున్నాను. మీ పరువు నిలబెడుతానని చెబుతున్నా, మా బాబాయ్కి కూడా ఈ సినిమా విడుదలైన తర్వాత పక్కాగా తీసుకెళ్ళి చూపిస్తా. సినిమా ఎలా ఉందని అడుగుతా. చరణ్ అన్నా, బన్నీ అన్నా, తేజ్ అందరికీ థాంక్స్. ఈ సినిమా విడుదలైన తర్వాత అభిమానులు గర్వపడేలా ఉంటుంది. ఈ సినిమా మావాడు చేశాడు. వరుణ్ చేశాడు అని చెప్పుకుంటారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అని చెప్పారు.
ఇప్పటి వరకు ఎవరూ తీయని బ్యాక్ డ్రాప్ వచ్చిన చిత్రం:
చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ''70 ఏళ్ళ తర్వాత రెండో ప్రపంచయుద్ధం మీద సినిమా తీశాను. ఈ సినిమా కోసం యూనిట్ చాలా కష్టపడింది. సినిమాలో వరల్ఢ్ వార్ పార్ట్ ను జార్జియాలో షూట్ చేశాం. అందుకోసం. జార్జియా గవర్న్ మెంట్ అనుమతి తీసుకుని ఆ బ్యాక్డ్రాప్కి తగిన విధంగా గన్స్, ట్యాంకర్స్, టీకప్స్ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వండర్ఫుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. చిరంతన్ భట్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. డిఫరెంట్ కథ అని చెప్పగలను. ఈ కథని పరిపూర్ణంగా ఎలా చెప్పాలో కథ రాసుకున్న తర్వాత తెలిసింది. మనకు చాలా మంది దర్శకులున్నా ఎందుకో రెండో ప్రపంచయుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ విభిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. ఒక ప్రయత్నం. చెప్పని కథలను చెప్పడానికి అవకాశమిచ్చిన నిర్మాతలకు, నా కోసమే అందమైన హీరోని కన్న నాగబాబుగారికి, మంచి ఫ్రెండ్ చరణ్కి, అమ్మానాన్నలకు, గురువుకు సహా అందరికీ నమ్మకం'' అని చెప్పారు.
స్ట్రాంగ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది
మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ''. ఈ సినిమా కోసం చాలా మందిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. రైటర్ సాయిమాధవ్ డైలాగులు పరమఅద్భుతం అయితే మా అన్న సీతారామశాస్త్రిగారు మహాద్భుతంగా రాశారు. ‘ముకుంద’తో మంచి పేరు తెచ్చుకున్నాడు వరుణ్. తను ఇంకా పేరు తెచ్చుకుంటే నిజమైన పుత్రోత్సాహం నాకు వస్తుంది. కంచె కథను క్రిష్ చెప్పినప్పుడు 20 నిమిషాలు మాట్లాడలేకపోయాను. డైరెక్టర్ క్రిష్ అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు '' అని చెప్పారు.
విలక్షణమైన సినిమా
సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ '' క్లిప్పింగ్స్ లో వరుణ్ని చూస్తుంటే మేన్లీనెస్, ముఖంలోని తేజస్సు నచ్చాయి. ఏ నటుడికైనా రెండో సినిమాగా ఇలాంటి సినిమా దొరకడం గ్రేట్. వరుణ్ని చూస్తుంటే హాలీవుడ్ నటుడిని చూసినట్టు అనిపించింది. ఒక మనిషి ఎలా ఉండాలో గమ్యం సినిమాతో చెప్పిన క్రిష్, తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం వంటి డిఫరెంట్ సినిమాలను చేశాడు. ఇప్పుడు కంచె మరో విలక్షణమైన మూవీ. చాలా క్లిష్టమైన కథ ఇది. క్రిష్ సులభంగా చెప్పాడు. ఈ సినిమాలో కొన్ని భాగాలను చూపించినప్పుడు ఆశ్చర్యపోయా. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో హాలీవుడ్లో, బాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చినా తెలుగులో ఈ కాన్సెప్ట్ వచ్చిన సినిమా. చూసే ప్రేక్షకుడిని 1945లోకి తీసుకెళ్తాయి ఈ సినిమాలోని సన్నివేశాలు. యుద్ధంలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కూడా యుద్ధంలాగే ఉంటుంది... అని చెబుతూ ప్రపంచంలోని మనిషి దేనికి కొట్టుకుంటున్నాడో తెలియని దాన్ని యుద్ధం రూపంలో చెప్పడం, అందులోనే ప్రేమను కూడా చెప్పడం... ఈ మనిషి తాలూకు వైరుధ్యాన్ని చూపించడం నాకు బాగా నచ్చింది. మనుషులకు మనుషులకు మధ్య, మనసులకు మనసులకు మధ్య, దేశాలకు దేశాలకు మధ్య ఉన్న అడ్డుకట్టను ‘కంచె’ అనే అర్థంలో చెప్పాడు క్రిష్. ఇందులోని ‘ఇటు ఇటు ఇటు..’ అనే పాట నాకు చాలా ఇష్టం. నేను ఈజీగా ఈ మూవీ పాటలు రాయలేదు. నవమాసాలు పూర్తయితే తప్ప ప్రసవం జరగదు. ఎంతవరకు ఎందుకొరకు అనే పాటను ఎనిమిది నెలల పాటు రాశా. అలాగు ‘వేదం’లోగానీ, ‘కృష్ణంవందేజగద్గురుం’గానీ రాసినప్పుడు చాలా సమయాన్ని తీసుకున్నా. ఈ సినిమాలో ఆఖరి పాట పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. అలాంటప్పుడు శాస్త్రిగారు పాట ఇచ్చేదాకా సినిమా రిలీజ్ను ఆపుకుందాం అని దర్శకనిర్మాతలు అనుకున్న తీరు నాపై బాధ్యతను పెంచింది. ఈ సినిమాకు గొప్ప పాటలు రాయడానికి అవకాశాన్ని కల్పించింది చిరంతన్ భట్. అతని ట్యూన్స్ తో పాటుగా నా పదాలు పయనించాయి. అత్యద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అతని ప్రయాణం తెలుగులో నిరంతరంగా కొనసాగాలి'' అని అన్నారు.
ఆ డిఫరెన్స్ ను ‘కంచె’ తీసేస్తుంది
డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ''ఇప్పటి వరకు క్లాస్ మూవీ, మాస్ మూవీ అనే కంచెను ఈ 'కంచె' మూవీ తీసేస్తుంది. క్రిష్గారు, నాగబాబుగారు లేకపోతే నేనిలా ఉండేవాడిని కాను. ఈ సినిమాకి చాలా భయభక్తులతో పనిచేశాను. నా మదర్ ప్రొడక్షన్గా భావిస్తాను. క్లైమాక్స్ ఇటీవలే చూశాను. ఇప్పటికీ ఆ క్లైమాక్స్ నన్ను హాంట్ చేస్తుంది. ఒక అద్భుతమైన సినిమాకి పనిచేశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు. సీతారామశాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు. మరో జన్మంటూ ఉంటే ఆయన కలంగా పుట్టాలని కోరుకుంటున్నాను. చాలా గొప్ప సినిమాకి పనిచేశానని భావిస్తున్నాను'' అన్నారు.
స్పెషల్ మూవీ:
హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ మాట్లాడుతూ ''చాలా స్పెషల్ మూవీ నాకు. ఇలాంటి స్క్రిప్ట్, డైరెక్టర్, వరుణ్ లాంటి కో యాక్టర్తో పనిచేయడం హ్యపీగా ఉంది. సినిమాలో సీతాదేవి పాత్ర చేశాను. చాలా ఎగ్జయిటింగ్ రోల్. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాననే అనుకుంటున్నాను. చిరంతన్ చాలా అందమైన సంగీతాన్నిచ్చారు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ని. శాస్త్రిగారు అందమైన, అర్థవంతమైన పాటలను ఇచ్చినందుకు చాలా హ్యాపీ. సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలు సహా టీమందరికీ ధన్యవాదాలు'' అని చెప్పారు.