English | Telugu

తెలుగు ప్రేక్షకులకి కృతిశెట్టి టాటా చెప్పినట్టేనా! 

వైష్ణవ్ తేజ్(Vaishnav Tej)హీరోగా, బుచ్చిబాబు(Buchibabu)దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)నిర్మించిన చిత్రం 'ఉప్పెన' ఈ మూవీ ద్వారా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన కన్నడ భామ 'కృతిశెట్టి'. మొదటి సినిమాలోనే ఎలాంటి బెరుకు లేకుండా సీనియర్ హీరోలకి ధీటుగా నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందింది. ముఖ్యంగా తండ్రి క్యారెక్టర్ విజయ్ సేతుపతి తో వచ్చిన సీన్స్ లో ఆమె పెర్ఫార్మెన్సు ని ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా చేసిన మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే వంటి చిత్రాల పరాజయంతో, తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

కృతి శెట్టి ప్రస్తుతం తమిళ సినీ పరిశమ్రలో తన జోరు కొనసాగిస్తోంది. లవ్ టుడే ఫేమ్ 'ప్రదీప్ రంగనాధన్'(Pradeep Ranganathan)తో చేస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్' కంపెనీ సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి 'నయనతార' భర్త 'విగ్నేష్ శివన్'(Vignesh Shivan)దర్శకుడు. దీంతో లవ్ ఇన్సూరెన్స్ పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. అగ్ర హీరో కార్తీ(Kathi)తో చేసిన 'వా వాతియార్' విడుదలకి సిద్ధం కాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జయం రవి(Jayam Ravi)తో 'జీని' అనే మూవీ చేస్తుంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మలయాళ చిత్ర రంగంలోకి అడుగుపెట్టి అగ్ర హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)తో 'ఖలీఫా' అనే చిత్రంలో చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి స్టార్ హీరోతో చెయ్యడం ఖాయమైతే కనుక, మలయాళంలో కృతికి మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మలయాళ, తమిళ చిత్ర రంగాల్లో కృతి ఫుల్ బిజీయస్ట్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది. దీంతో ఆమె తెలుగుకి దాదాపుగా గుడ్ బై చెప్పినట్టే అనే వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి.