English | Telugu

టికెట్ ధరల పెంపు వివాదం.. పిటిషనర్ కి సంచలన ఆఫర్ ఇచ్చిన డీవీవీ!

తెలంగాణలో 'ఓజీ' సినిమాకి పది రోజుల పాటు టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిని సవాల్ చేస్తూ మల్లేష్ యాదవ్‌ అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. ఇప్పటికే టికెట్ ధరల పెంపు మెమోని సస్పెండ్ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. (They Call Him OG)

Also Read:ఓజీ ఎఫెక్ట్.. ఇక నుండి తెలంగాణలో నో టికెట్ హైక్

ఒక వైపు టికెట్ రేట్ల పెంపు గురించి తీవ్ర చర్చ జరుగుతుండగా, తాజాగా పిటిషనర్ మల్లేష్ యాదవ్‌కు ఓ ఆఫర్ ఇస్తూ 'ఓజీ' చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంచలన ట్వీట్ చేసింది. "పిటిషనర్ మల్లేష్ యాదవ్‌కు మాత్రమే వర్తించేలా 'ఓజీ' టికెట్ ధరల పెంపు మెమోను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కాబట్టి అతనికి మేము నైజాంలోని ఏదైనా థియేటర్‌లో టికెట్‌పై రూ.100 తగ్గింపు అందిస్తున్నాము. మల్లేష్ గారూ, మా అభిమానులు ఆస్వాదిస్తున్నట్లుగా మీరు కూడా సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము." అంటూ డీవీవీ అఫీషియల్ హ్యాండిల్ లో ట్వీట్ దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 'ఇదెక్కడి ఆఫర్ రా మావ' అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.