English | Telugu
ఆడియో ఫంక్షన్ కి రావడానికి సుమన్ రెండు లక్షలడిగారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Updated : Jun 22, 2023
తన సినిమా ఆడియో ఫంక్షన్కు రావడానికి సీనియర్ నటుడు సుమన్ రెండు లక్షలు అడిగారంటూ దర్శకుడు నర్రా శివనాగు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదర్శన్, రంగస్థలం మహేశ్, అర్జున్ తేజ్ కీలక పాత్రధారులుగా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నట రత్నాలు'. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ బుధవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ "సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను అవన్నీ దాటుకొచ్చిన వాడినే. అలాంటి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుంది. నేను 14 చిత్రాలు తీశా. ఏ సినిమా వల్ల నా నిర్మాతకు నష్టంరాలేదు. చాలా వరకూ నాకు సహకరిస్తారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే అసిస్టెంట్తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్మెన్ ఫోన్ ఎత్తి "శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్కి వస్తారట అండీ" అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు. సీనియర్ నటుడు సుమన్. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది" అన్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎంఎల్ఎ యరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "గతంలో నేను కొన్ని ఆడియో ఫంక్షన్లకు వచ్చా. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, మిర్చి తరహా చిత్రాలంటే నాకు ఇష్టం. ఈ చిత్రం బాగా నడుస్తుందని భావిస్తున్నా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అన్నారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం" అన్నారు.
