English | Telugu
ఈ వార్త కనుక నిజమైతే దిల్ రాజు భారీ రిస్క్ చేస్తున్నట్టే
Updated : Oct 13, 2025
నిర్మాత అంటే క్యాషియర్ కాదు, మేకర్ అని నిరూపించిన అతితక్కువ మంది నిర్మాతల్లో 'దిల్ రాజు'(Dil Raju)కూడా ఒకరు. ఇది దిల్ రాజు సినిమా అనే ఒక బ్రాండ్ ని కూడా సృష్టించుకొని, రీసెంట్ గా 'సంక్రాంతికి వస్తున్నాం' తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. సబ్జెక్ట్ ని మాత్రమే నమ్ముకొని సదరు సబ్జెక్టు ని అన్ని విభాగాల్లోను అగ్ర శ్రేణిగా నిలిపి, ప్రేక్షకుల అదరణని చూరగొనేలా చేయడంలో దిల్ రాజు కి తిరుగులేదు. ఇందుకు ఆయన సినీజర్నీనే ఒక ఉదాహరణ. అందుకు తగ్గట్టే విజయాలు శాతం కూడా ఎక్కువే. కానీ గత కొంత కాలంగా వెనకపడ్డాడు. ఈ విషయాన్నీ ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
ఇక దిల్ రాజు తన సినిమాటిక్ పరిధిని పెంచుకోవాలనుకునే క్రమంలో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ వంటి తెలుగు చిత్రాలని రీమేక్ చేసాడు. ఆ రెండు పరాజయాన్ని అందుకున్నాయి. దీంతో దిల్ రాజు బాలీవుడ్ లోకి వెళ్లి ఎందుకు రిస్క్ చేసాడనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపించాయి. రీసెంట్ గా మళ్ళీ దిల్ రాజు బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, 'సంక్రాంతికి వస్తున్నాం' ని అక్షయ్ కుమార్(Akshay Kumar)తో రీమేక్ చెయ్యబోతున్నాడనే వార్తలు సినీ సర్కిల్స్ లో హల్ చేస్తున్నాయి. అక్షయ్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ చిత్రంపై త్వరలోనే అధికార ప్రకటన రానుందని కూడా అంటున్నారు.
అలాగే సల్మాన్ ఖాన్(salman Khan)తో కూడా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడనే న్యూస్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తన పరిధిని పెంచుకోవాలని ఏ నిర్మాత అయినా భావించడం సహజం. పైగా దిల్ రాజు లాంటి సుదీర్ఘ అనుభవమున్న నిర్మాత కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో విజయాల శాతం తక్కువగా ఉంది. సల్మాన్, అక్షయ్ వరుస ప్లాప్ ల్లో ఉన్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ ఇద్దరి చిత్రాలు కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ ఎంట్రీ వార్త నిజమైతే దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడేమో అనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు ప్రస్తుతం 'విజయ్ దేవరకొండ' తో రౌడీ జనార్దన్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.