Read more!

English | Telugu

మూడు సినిమాలు ఢీకొడుతున్నాయి..

ఈ శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ కు ముస్తాబయ్యాయి. వంశీ వెన్నెల్లో హాయ్ హాయ్, కళ్యాణ వైభోగమే,స్పీడున్నోడు థియేటర్లలో తలపడబోతున్నాయి. వీటిలో మొదటి రెండూ చిన్న సినిమాలు కాగా, ' స్పీడున్నోడు' కు మాత్రం ఎక్కువగానే బడ్జెట్ పెట్టారు.ఈ మూడింటి గురించి ఒకసారి చూస్తే...

' వంశీ వెన్నెల్లో హాయ్ హాయ్ మూవీ ' చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తయినా,రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. '  ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ' లోని పాటనే సినిమాకు టైటిల్ గా పెట్టారు దర్శకుడు వంశీ. మొదట ' తను మొన్నే వెళ్లిపోయింది ' అని టైటిల్ పెట్టి ఆ తర్వాత ' మెల్లగా తట్టింది మనసు తలుపు ' అని మార్చి, చివరికి తన సినిమా పాటలోని మాటనే టైటిల్ గా ఫిక్స్ అయ్యారు వంశీ. 'రంగం' ఫేం అజ్మల్, నికితా నారాయణ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు.


' అలా మొదలైంది ' తో సక్సెస్ చూసిన నందినీ రెడ్డి దర్శకత్వంలో, ' ఊహలు గుసగుసలాడే' తో సక్సెస్ మెట్టు ఎక్కిన నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా కళ్యాణ వైభోగమే.ఈ ఇద్దరికీ ఇప్పుడు సక్సెస్ చాలా కీలకం కావడంతో, ఈ సినిమాపై రిజల్ట్ పైనే వీరి ఆశలున్నాయి.నాగశౌర్యకు జతగా, ' ఎవడే సుబ్రహ్మణ్యం ' భామ మాళవికా నాయర్ నటిస్తోంది


తన మొదటిసినిమా ' అల్లుడు శీను' తో సక్సెస్ ను సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండో ప్రయత్నంగా ' స్పీడున్నోడు ' గా వస్తున్నాడు. భీమనేని దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే, భారీగా థియేటర్లు కూడా దక్కించుకుంది. కామెడీ నుంచి మాస్ డైరెక్టర్ గా మారాలనుకుంటున్న భీమనేనికి, ద్వితీయ విఘ్నాన్ని దాటడానికి బెల్లంకొండ సాయికి, ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకంగా మారింది.

సినిమా అనేది ఎప్పుడూ బడ్జెట్ వల్లో, స్టార్ కాస్ట్ వల్లో హిట్ కాదు.విషయముంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు.మరి రేపు ఢీకొంటున్న ఈ మూడు సినిమాల్లో విజేత ఎవరు..? చూద్దాం..