English | Telugu
వైవీఎస్..ఈసారి కొట్టాల్సిందే ..!!
Updated : Sep 9, 2015
సాహసాలకు పెట్టింది పేరైన వైవీఎస్.. ‘రేయ్’ లాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ ఇంకో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. కెరీర్ ఆరంభంలో ఎన్నో మంచి చిత్రాలను అందించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వైవీఎస్ చౌదరి. ఆ తర్వాత నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మించాడు. నిర్మాతగా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న చౌదరి గత కొంత కాలంగా తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాడు. ఈయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలు బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఈయన తీవ్ర ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మెగా హీరో సాయిధరమ్ తేజ్తో ‘రేయ్’ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించి తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాడు. ‘రేయ్’కి పెట్టిన బడ్జెట్లో కనీసం సగం కూడా రిటన్ అవ్వలేదు. దాంతో ఈ దర్శక నిర్మాత తర్వాత సినిమాకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు చౌదరి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తన బొమ్మరిల్లు బ్యానర్లో తానే స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు.
కొత్త సినిమాకు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో టైటిల్ను రిజిస్ట్రర్ చేయించాడు. అంతా కొత్త వారితో తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చౌదరి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో తన టాలెంట్ను మరోసారి తెలుగు ప్రేక్షకులను చూపించి, ఇండస్ట్రీలో తన క్రేజ్ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అదనపు హంగుల మీద కాకుండా కొంచెం కంటెంట్ మీద దృష్టిపెట్టాలి. అప్పుడే మళ్లీ నిలబడగలడు.