English | Telugu
టెన్షన్ లో 'రాజా సాబ్' మూవీ టీమ్.. షూటింగ్ కష్టమేనా..?
Updated : Aug 24, 2025
తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించడంతో మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' షూటింగ్ మళ్ళీ మొదలవుతుందా? అసలు సినీ కార్మికులు ఈ షూటింగ్ కి హాజరవుతారా లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడినట్లు తెలుస్తోంది.
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న 'రాజా సాబ్' కొత్త షెడ్యూల్ ను రేపటి(ఆగస్టు 25) నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందా లేదా? అనే టెన్షన్ మూవీ టీంలో నెలకొంది.
సినీ కార్మికుల సమ్మె సమయంలో ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్కు లీగల్ నోటీసులు ఇచ్చారు. సమ్మె విరమించిన తర్వాత ఆ నోటీసులు విత్ డ్రా చేసుకుంటానని ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు విశ్వప్రసాద్ పై గుర్రుగా ఉన్నాయట. దీంతో 'రాజా సాబ్' షూటింగ్ ఉంటుందా లేదా? అని ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ టెన్షన్ మొదలైంది.
అయితే 'రాజా సాబ్'కి లైన్ క్లియర్ అయిందని, రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ఈనెలాఖరు వరకూ అజీజ్ నగర్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పై కొన్ని కీలక స్ననివేశాలను చిత్రీకరించనున్నారు. సెప్టెంబరు 17 నుంచి కేరళలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేయనున్నారు. ఆ తర్వాత విదేశాల్లో రెండు పాటలు చిత్రీకరణ ఉంటుంది. దాంతో రాజాసాబ్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
'రాజా సాబ్'ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 2026 సంక్రాంతికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి.