English | Telugu

మసకబారిన బెజవాడ థియేటర్ల ఘన చరిత్ర

ఎన్టీఆర్.. అక్కినేని, మెగాస్టార్ ఏ వంశం హీరో సినిమా రిలీజ్ అయినా.. సినిమా హిట్టో, ఫట్టో తెలియాలంటే ముందుగా బెజవాడకు ఫోన్ చేయండి.. బెజవాడ గాంధీ నగర్ టాక్ ఏంటో తెలుసుకోండి అనేవారు. గాంధీనగర్‌లో టాక్ హిట్ అని వస్తే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకునేవారంతా. ఇది ఒకప్పుడు విజయవాడ గాంధీ నగర్‌కి, సినిమాకి ఉన్న సంబంధం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు.. ఆ తర్వాత తరంలోని చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, వారి తర్వాత వచ్చిన యంగ్ హీరోలు.. ఇలా ఏ హీరో సినిమా విడుదలైనా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుల నుంచి నేరుగా గాంధీనగర్‌కి ఫోన్లు వచ్చేవి. అంతటి గొప్ప చరిత్ర గల బెజవాడలోని థియేటర్ల సీన్ కరోనా పుణ్యమా అని ఇప్పుడు దారుణంగా మారింది.

ఓటీటీల ప్రభావం, థియోటర్లలో సినిమాల రిలీజ్ సంఖ్య తగ్గిపోవడం... కారణాలు ఏమైనా విజయవాడలోని సింగిల్ స్క్రీన్ ధియేటర్స్ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు ఈ థియేటర్లు కళ తప్పాయి. ఏకంగా మూతపడుతున్నాయి. విజయవాడతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు 52 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి. అందులో కొన్ని ఇప్పటికే కళ్యాణ మండపాలుగా మారగా... మరికొన్ని థియేటర్లు మూసేశారు. ఇక విజయవాడ నగరంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే.. మూడు , నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కొన్ని థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇక ఎన్నో సంవత్సరాల చరిత్ర అన్నపూర్ణ శకుంతల థియేటర్స్‌ని నడపలేక కూల్చివేస్తున్నారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ప్రస్తుతం నడపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓవైపు సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో సంవత్సరంలో సగం పైగా థియేటర్లు ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్ నడపాలంటే నెలకి 2.50 లక్షల నుంచి 6, 7 లక్షలు ఖర్చవుతుంది. అంతేకాదు నగరాల్లో సింగిల్ స్క్రీన్, ఏసీ థియేటర్‌లో కరెంటు వాడినా, వాడకపోయినా లక్షా 30 వేలు కట్టాలి. దాంతో పాటు జీఎస్టీ అని, ఇన్‌కమ్‌ టాక్స్, బిల్డింగ్ టాక్స్, ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ అంటూ అనేక ఖర్చులు. టికెట్‌పై కూడా జీఎస్టీ వేయడం మరింత భారాన్ని మోపుతోంది.

సరే ఇంతా ఖర్చు పెట్టి థియేటర్లను నడిపితే.. ఆక్యుపెన్సీ 10 శాతం కూడా ఉండటం లేదంటున్నారు థియేటర్ యజమానులు. వీటన్నింటికి తోడు రెంటల్ సిస్టమ్‌ కూడా తమ కొంప ముంచుతుందంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మల్టీప్లెక్స్‌లకు ఇచ్చేంత పర్సంటేజీ థియేటర్లకు ఇవ్వడం లేదంటున్నారు. విజయవాడలో ఎంతో చరిత్ర కలిగిన అప్సర థియేటర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 50 సంవత్సరాలుగా ఎంతోమంది హీరోల హిట్ సినిమాలు ప్రదర్శించి కిటకిటలాడిన అప్సర థియేటర్ ప్రస్తుతం వెలవెలబోతుంది.

విజయవాడలో ఎన్నో ఏళ్లుగా సినిమాలు చూస్తున్న సగటు ప్రేక్షకుడు మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకప్పుడు విజయవాడలో ఏ థియేటర్ చూసినా ప్రేక్షకులతో కోలాహలంగా సందడిగా ఉండేదని, ఇప్పుడు ఏ థియేటర్ చూసినా ఖాళీగా కనబడుతుందని ఆవేదన చెందుతున్నారు. సినిమా నిర్మాతలు కూడా సినిమాలు చంపేస్తున్నారని... వాళ్ళ లాభం కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసేలా చేస్తున్నారంటున్నారు.

ఇక విజయవాడలోని గాంధీ నగర్‌లో ఉన్న శైలజ, అలంకార్, జయరాం థియేటర్‌లలో మాత్రం అప్పుడప్పుడు సందడి కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద సినిమా రిలీజ్‌లు, హీరోల పుట్టినరోజులు సందర్భంగా ఈ థియేటర్ల వద్ద మాత్రమే అభిమానులు సందడి చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఆ సినీ సంబరం కూడా ఇంకా ఎన్నిరోజులు ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.