English | Telugu

ఏడాదికి మూడైనా చేస్తాం అంటున్న రితేష్!

జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్‌. నార్త్ ఇండియాలో, ముఖ్యంగా మ‌రాఠీ ఇండ‌స్ట్రీలో రితేష్ దేశ్‌ముఖ్‌కి స్పెష‌ల్ క్రేజ్ ఉంది. రీసెంట్‌గా భార్యాభ‌ర్త‌లు క‌లిసి వేడ్ అనే సినిమా చేశారు. రితేష్ దేశ్‌ముఖ్ ఓన్ ప్రొడక్షన్ కంపెనీ ముంబై ఫిలిం కంపెనీ. ఈ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా వీళ్ళు ఈ మధ్య మరాఠీ సినిమాలను తరచుగా తరికెక్కిస్తున్నారు. ఇకపై ఏడాదికి మూడు మరాఠి సినిమాలను తెర‌కెక్కించాలని నిర్ణయించినట్టు తెలిపారు రితేష్. ఇటీవల రితేష్, జెనీలియా కలిసి నటించిన వేడ్‌ సినిమాకు మరాఠీలో చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు రితేష్‌.

తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినా మజిలీ సినిమా ఆధారంగా చేసుకుని మరాఠీలో వేడ్‌ సినిమా రూపొందింది. ఈ సినిమాను జెనీలియా నిర్మించారు. ఈ సినిమా మరాఠీలో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. జెనీలియాతో కలిసి ఎన్ని సినిమాల్లో చేసినప్పటికీ దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని, ప్రేక్షకులు తమ జంటను ఆదరించే తీరు చూసి ఆనందంగా ఉంటుందని అన్నారు రితేష్. ఇకపై మరాఠీలో ఏడాదికి మూడు సినిమాలు నిర్మించేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్టు తెలిపారు జెనీలియా భర్త.

జెనీలియా తెలుగులో కమ్ బ్యాక్ అవుతున్నారు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ రామ్ హీరోగా న‌టిస్తున్న సినిమాతో క‌మ్ బ్యాక్ అవుతున్నారు తెలుగువారి హాసిని. తెలుగులో మజిలీలో సమంత పోషించిన పాత్రను మరాఠీలో వేడ్‌లో అద్భుతంగా పోషించార‌ని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు జెనీలియా. సౌత్లో సూర్య జ్యోతిక‌కు ఉన్నంత క్రేజ్‌... ఇప్పుడు నార్త్ లో ముఖ్యంగా మరాఠీ ఇండస్ట్రీలో జెనీలియా, రితేష్‌కి ఉంది.