English | Telugu

బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు.. మతతత్వ పార్టీలతో జట్టుకట్టం

అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. రాజ్యసభ, మండలి ఎన్నికల్లో సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ లేదా ఇతర అభ్యర్థులకు తాము ఓట్లు వేస్తామంటూ ఆమె ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఎస్పీ మధ్య పొత్తుపొడిచే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మాయావతి.. బీజేపీకి అనుకూలంగా ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌ వాది పార్టీలు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఎస్పీ నుంచి ముస్లింలను దూరం చేసేందుకే తమకు వ్యతిరేకంగా ఆ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, సార్వత్రిక ఎన్నికల్లో గానీ బీజేపీతో తమ పార్టీ కూటమి కట్టే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున జట్టుకట్టడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. తమది సర్వజన హితం కోరే పార్టీ అని, మతతత్వ పార్టీలతో స్నేహం చేయదని అన్నారు. కుల, మత, పెట్టుబడిదారీ సిద్ధాంతాలున్న వారితో బీఎస్పీ కూటమి కట్టడం జరగదు అని పేర్కొన్నారు. మతతత్వ పార్టీలపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, తాను ఎవరి ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని చెప్పారు. తాను అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ అలాంటి పార్టీల కూటమిలో మాత్రం చేరబోనని మాయావతి స్పష్టం చేశారు.