English | Telugu
విశాఖలో దారుణం... కూతుర్ని చంపి... తల్లి ఆత్మహత్యాయత్నం..!
Updated : Feb 13, 2020
విశాఖలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానస కథ విషాదంగా ముగిసింది. తల్లి ఆవేశమో లేక అమాయకత్వమో తెలియదు గానీ, జరగరాని దారుణం జరిగిపోయింది. ఓ కంటి పాప తీరని లోకాలకు వెళ్లిపోయింది. అందమైన ఆ ఇంటి కల చెదిరిపోయింది. అనుకోని అపార్ధాలు కుటుంబం మొత్తానికి తీరని ఆవేదన మిగిల్చింది.
విశాఖ పులగవానిపాలెంలో బంగారం అత్తాకోడళ్ల మధ్య చిచ్చుపెట్టింది. తన బంగారాన్ని ఆడపడుచుకు ఇచ్చేశారంటూ అత్తతో కోడలు గొడవ పడింది. చివరికి అత్త సూటిపోటి మాటలను తట్టుకోలేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా తనకున్న ఏడాదిన్నర పాపతో తీసుకుని తన ఇంటి వెనుకున్న ఎత్తయిన కొండ ఎక్కింది.... మూడ్రోజులపాటు కొండ దగ్గరే తిరుగుతూ గడిపింది... అయితే, అన్నం నీళ్లూ లేకపోవడంతో సొమ్మసిల్లిపడిపోయింది... చివరికి గొర్రెల కాపరులు ఆమెను గమనించి... పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... మూడ్రోజుల క్రితం అదృశ్యమైన సుమలతగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే, పాప కనిపించకపోవడంతో... తల్లి సుమలత ఇచ్చిన సమాచారం మేరకు పెందుర్తి ఎర్రకొండ అడవుల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో కొండను... కొండ కిందనున్న పరిసరాలను జల్లెడ పట్టారు. అయితే, సుమలత చెప్పినట్లుగా ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా, రెండు మూడుసార్లు ఎర్రకొండ పరిసరాలను జల్లెడ పట్టినా... పాప ఆచూకీ దొరకకపోవడంతో... అసలు చిన్నారి ఏమైందనేది పోలీసులను కంగారుపెట్టింది.
అయితే, అన్నంనీళ్లూ లేక ఏడ్చిఏడ్చి ఆకలితో చిన్నారి చనిపోతే తానే కొండ కింద పాతిపెట్టానని తల్లి సుమలత చెప్పడంతో మరోసారి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే, డాగ్ స్క్వాడ్తో రెండ్రోజులపాటు చిట్టడవిలో గాలించినా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మూడ్రోజులపాటు వెదికినా చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో... చివరికి తల్లిని కూడా స్పాట్కి తీసుకొచ్చారు. తల్లి కూడా స్పాట్ని ఐడెంటిఫై చేయలేకపోవడంతో... 20మంది పోలీసులు, 30మంది కుటుంబ సభ్యులతో కలిసి అడవి జల్లెడపట్టి చివరికి చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. మట్టిలో కప్పిన చిన్నారి మృతదేహాన్ని చూసిన జ్ఞానస తండ్రి తట్టుకోలేకపోయాడు. చిన్నారి మృతదేహం దగ్గర కూర్చొని గుండెలు పగిలేలా విలపించాడు.
చిన్నారి తల్లి సుమలత... ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు... తన వయస్సున్న మహిళ ఆహారం నీళ్లూ లేకుండా ఎన్ని రోజులు జీవించవచ్చనే విషయాన్ని తన ఫోన్ ద్వారా గూగుల్ వెదికినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, చిన్నారిని తీసుకుని కొండెక్కి చిట్టడవిలోకి వెళ్లిన సుమలత.... తన గొంతు, చేతిపై గాయాలు చేసుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నంలో సొమ్మసిల్లిపడిపోవడంతో మూడ్రోజుల తర్వాత గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అలా, సుమలత ఆచూకీ దొరికినా... చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. అయితే, చిన్నారిని తల్లే చంపిందా? లేక సుమలత చెబుతున్నట్లుగా అన్నంనీళ్లూ లేక ఏడ్చిఏడ్చి చనిపోయిందా? అనేది సస్పెన్స్గా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత క్లారిటీ రానుంది. అయితే, సుమలత పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో... ఆమె మానసిక స్థితిపైనా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.