English | Telugu

అప్పుడు రాజయ్య... మొన్న లక్ష్మారెడ్డి... ఇఫ్పుడు ఈటల... కలిసిరాని ఆరోగ్యం...

తెలంగాణ ఆరోగ్యశాఖ గులాబీ నేతలకు అచ్చిరావడం లేదన్న చర్చ నడుస్తోంది. ఒకప్పుడు ఆరోగ్య శాఖ అంటే చాలామంది నేతలు ఎగబడేవారు. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం, సంతృప్తి ఉండేదని ఫీలయ్యేవారు. కానీ తెలంగాణలో ఇప్పుడు ఆరోగ్యశాఖ అంటేనే నేతలు హడలిపోతున్నారు. ఎందుకీ శాఖ ఇచ్చారని సణుక్కుంటున్నారట. ఎందుకంటే, గతంలో ఈ శాఖ నిర్వహించిన నేతల పరిస్థితి అయోమయంగా మారడమే ఇందుకు కారణమంటున్నారు. టీఆర్ఎస్‌ మొదటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాతో రాజయ్యకు వైద్యారోగ్యశాఖ అప్పగించారు. అయితే ఆయనతో వచ్చిన సమస్య ఏమిటో చెప్పలేదు కానీ, ఏకంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఆయనతో కేసీఆర్ కు ఎలాంటి విభేదాలూ రాలేదు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

అయితే, ఈసారి వైద్యారోగ్యశాఖను ఈటల రాజేందర్‌కు అప్పగించారు. ఈయనది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఎందుకంటే, ఈటల మంత్రి పదవి ఎప్పుడు పోతుందోనంటూ ప్రచారం జరిగింది. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని ఈటల తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తామే గులాబీ పార్టీలకు ఓనర్లమంటూ ఏకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసి టీఆర్ఎస్ లో పెను ప్రకంపనలు సృష్టించారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకే ఏడాదిలో ఇంతవరకూ ఒక్కసారి కూడా, ఆరోగ్య శాఖపై ఈటలతో కలిసి కేసీఆర్ సమీక్ష నిర్వహించలేదని చెబుతున్నారు. ఇలా ఆరోగ్య శాఖ తీసుకున్న ఏ నేతకూ, ఆ శాఖ కలిసిరావడంలేదనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి, తెలంగాణలో ఆరోగ్యశాఖ అంటేనే హడలిపోతున్నారు గులాబీ నేతలు. ఏ ముహూర్తాన ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టారో తెలియదు గానీ మానసికంగా రాజకీయంగా అనారోగ్యం బారినపడేస్తుందని అంటున్నారు.