English | Telugu
తెలంగాణలో టపాసులపై నిషేధం విధించిన సర్కార్
Updated : Nov 13, 2020
కరోనా తీవ్రత నేపథ్యంలో టపాసులను నిషేధించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన లాయర్ ఇంద్రప్రకాశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి విజయ్సేన్రెడ్డిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టగా.. కరోనా వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో టపాసుల వినియోగం వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా టపాసులు పేల్చడం ద్వారా ఏర్పడే కాలుష్యంతో ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ బాణసంచా నిషేధంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు స్వీయ నియంత్రణలు పాటిస్తారని ఆశిస్తున్నదని తెలిపారు.
రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే వాయు కాలుష్యం శ్వాస కోశ ఇబ్బందులు సృష్టిస్తుందని తెలిపింది. దీంతో గాలి నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బతింటున్న కారణంగా.. మరోపక్క దేశంలో కొన్ని చోట్ల కరోనా సేకండ్ వేవ్ మొదలవడంతో.. పండుగలు జరుపుకోవడం ముఖ్యమేనని, అయితే ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో బాణసంచాపై నిషేధం విధించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది.