English | Telugu

లంచాలు గుంజడంలో ఏపీ ఉద్యోగులు టాప్..! తాజా సర్వేలో వెల్లడి

ఏపీలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు లంచాలు తీసుకోవడంలో ఆరితేరిపోయారని తాజాగా ఒక సర్వేలో తేలింది. ఎలక్ట్రిసిటీ యాక్సెస్‌ ఇన్‌ ఇండియా: బెంచ్‌మార్కింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీస్‌ పేరుతో కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా కలిసి సంయుక్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. ఎక్కువగా లంచాలు తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగదారుల నివేదిక ఆధారంగా ఈ సర్వే జరిగినట్లుగా వెల్లడించారు. ఈ సర్వేలో దాదాపు 57శాతం మంది వినియోగదారులు పాల్గొనగా.. విద్యుత్ సేవలకు సంబంధించి తాము ఎదుర్కున్న పరిస్థితులను ఈ సర్వేలో అధికారులకు వివరించారు. ఈ సర్వే ఆధారంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల పై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను ఈ నివేదిక సూచించింది.

తాము చేసిన పనికి మించి అదనంగా డబ్బులు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని వినియోగదారులు స్వయంగా ఈ సర్వేలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ సర్వే లో పాల్గొన్నవారిలో గృహ వినియోగదారులు 33% మంది, సంస్థాగత వినియోగదారులు 21% శాతం మంది ఉన్నారు. గుజరాత్‌ ఉద్యోగులలో అవినీతి తక్కువగా 8 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ, తూర్పు డిస్కంల పరిధిలో అత్యధికంగా 57 శాతంగా ఉందని తేలింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యుత్తు సమస్యలు తెలుసుకోవడానికి 10 రాష్ట్రాల్లోని 25 డిస్కంల పరిధిలో 25,116 మంది వినియోగదారులను సర్వే చేశారు. దీంట్లో ఏపీ‌లో 1,809 మంది ఉన్నారు. ఈ సర్వేపై స్పందించిన నీతి ఆయోగ్‌ అటు వినియోగదారులను చైతన్య పరచడంతో పాటు, ఇటు అదనపు మొత్తాలను అడిగే సిబ్బందిపై కూడా సంబంధిత డిస్కింలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.