English | Telugu

ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు! సీఎం, డీజీపీలకు చంద్రబాబు లేఖ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ నేతలు భయానక పరిస్థితులు నెలకొల్పారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. తాడిపత్రిలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరగకుండా చూడాలని ఆయన కోరారు. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు నాయుడు అన్నారు. జేసీ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వాటిల్లినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో జేసీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.