English | Telugu

స్వచ్ఛ సర్వేక్షణ్ 2020.. టాప్‌ 10లో మూడు ఏపీ నగరాలు

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్-2020’జాబితాను ప్ర‌క‌టించింది. దేశంలో అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్ నగరం ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఇలా వ‌రుస‌గా నాలుగో సారి ఇండోర్‌ మొదటి స్థానం కైవసం చేసుకోవ‌డం విశేషం. రెండో స్థానంలో గుజరాత్ లోని సూర‌త్‌, మూడో స్థానంలో మ‌హారాష్ట్ర‌లోని ముంబై నిలిచాయి. ఇక మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి నగరాలకు చోటు దక్కింది. దేశంలోనే ప‌రిశుభ్ర‌త గ‌ల న‌గ‌రంగా విజ‌య‌వాడ నాలుగో స్థానం ద‌క్కించుకుంది. తిరుప‌తి ఆరో ర్యాంకు, విశాఖ‌ప‌ట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది.

స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే పద్ధతిని 2016లో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనిలో భాగంగా పరిశుభ్రతను పాటించే 129 అత్యుత్తమ నగరాలు, రాష్ట్రాలకు పురస్కారాలు ఇస్తారు. తొలి సంవత్సరం దేశంలోనే పరిశుభ్ర నగరంగా మైసూరు నిలిచింది. ఆ తర్వాత ఏడాది ఇండోర్ పురస్కారం దక్కించుకుంది. అప్పటి నుంచి ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది.

ఇక, దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆరో స్థానాన్ని ద‌క్కించుకోగా, తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది.