English | Telugu

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కి చుక్కెదురు.. హైకోర్టుకు కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ సుధీర్‌ బాబు కేసులో స్టే ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, వారంలోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. వారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే, హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీం వ్యాఖ్యానించింది. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూనే వస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.

సుధీర్ బాబు తహసీల్దార్ హోదాలో అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, హైకోర్టు ఆ ఆదేశాలపై స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం స్టే ఎత్తేయడానికి నిరాకరిస్తూ హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.