English | Telugu

విజయవాడ ఘటన పై బాబు మౌనం అందుకే.. వైసీపీ ఫైర్ 

నిన్న విజయవాడ లోని కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన సంగతి తెల్సిందే. తాజాగా ఇదే విషయం పై ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి బాబును కుల పరంగా టార్గెట్ చేసారు. చంద్రబాబు ప్రతి రోజు నిర్వహించే జూమ్ యాప్ కాన్ఫరెన్సుల్లో పాల్గొనే రమేశ్ చౌదరి నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను స్థానిక రమేశ్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్ గా నిర్వహిస్తోంది. ఈ హాస్పిటల్ అధినేత రమేశ్ చౌదరి విషయంలో చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని తాజాగా ఓ మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి బాబును నిలదీశారు. ప్రతిదానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే ప్రతిపక్ష నేత చంద్రబాబు రమేష్ హాస్పిటల్స్ అధినేత రమేశ్ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని అయన సూటిగా ప్రశ్నించారు.

మీ పార్టీకి సంబంధించిన వాళ్లు తప్పు చేస్తే ఒకరకంగా.., ఇతరులు చేస్తే మరో రకంగా స్పందించడం మీ నైజం అని ఎద్దేవా చేస్తూ.. మీ నైజాన్ని బయటపెట్టేందుకే మా పార్టీ పయత్నిస్తోంది అని అన్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడుగా, ప్రతిపక్ష నేతగా పనిచేసే వ్యక్తి ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని.. అన్నిటికి అతీతంగా వ్యవహరించినప్పుడే మనం నాయకులం అవుతాం. ఐతే అలాంటి ఉద్దేశం మీకు ఏ కోశానా లేదు. నీకు తెలిసిందల్లా ప్రతిదానికీ కుల రాజకీయాలు చేయడమే. తప్పు చేసిన వారిని శిక్షించినా కూడా కుల ప్రస్తావన తీసుకువస్తావు. నీ స్వంత పార్టీ వాళ్లే బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలపైన దాడిచేసినా అందుకు ప్రభుత్వాన్నే తప్పు పడతావు. నువ్వు ఈ రెండు నాల్కల ధోరణి మానుకోవాలి అంటూ బాబు పై ఫైర్ అయ్యారు. రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై మాత్రం ఎందుకు మాట్లాడవు అని శ్రీకాంత్ రెడ్డి బాబును ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో ఫలానా వ్యక్తులది తప్పు అని ఎందుకు ఒక్క మాటా మాట్లాడడం లేదని అయన చంద్రబాబును నిలదీశారు.