English | Telugu

సోనూసూద్ ఆస్తులు తాకట్టు! పేదల దేవుడంటున్న అభిమానులు

సినిమాల్లో అతను విలన్. కాని నిజ జీవితంలో మాత్రమే అతనో హీరో.. రియల్ హీరో. కష్టాల్లో ఉన్నవారికి , ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే అభాగ్యులకు ఆయన చిరు దీపంలా నిలిచారు. పేదల గుండెల్లో హీరోగా నిలిచిన అతనో బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా సమయంలో ప్రజలకు ఆపద్భాందవుడిగా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో వందలాది మంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి ఇంటి వరకు చేర్చిన మహానుభావుడు సోనూ సూద్. ఆ తర్వాత కూడా ఎందరో నిస్సహాయులకు ఆపన్న హస్తం అందించాడు. అడిగిన వారికల్లా సాయం అందించిన రియల్ హీరో.. ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. అవును పేదల కోసం డబ్బులు ఖర్చు పెట్టిన సోనూ సూద్.. అప్పుల పాలయ్యాడు. తన ఆస్తులను తాకట్టు పెట్టాడు.

వినడానికి బాధగా ఉన్నా సోనూసోదూ అప్పులపాలయ్యాడు అనడం నిజం. కరోనా వల్ల సినిమాలు ఆగిపోవడం, లాక్ డౌన్ వల్ల తనకున్న హోటల్స్, ఇతర వ్యాపారాలు నిలిచిపోవడంతో సోనుసూద్ ఆదాయం పడిపోయింది. దేశ వ్యాప్తంగా ఆపన్నలు సహాయం కోసం ఆర్ధిస్తుండడంతో వారికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు. ఈ క్రమంలో సోనుసూద్ ఆస్తులు కరిగిపోయాయని తెలుస్తోంది. దీంతో డబ్బుల కోసం సోనుసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టాడట.

సోనుసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10కోట్లు అప్పుగా తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముంబయిలో రూ.కోట్ల విలువైన ఆరు ప్లాట్లు, రెండు షాపులను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులన్నీ కూడా ఆయన భార్య సోనాలికి చెందినవిగా సమాచారం. తాకట్టు ఒప్పందం ప్రకారం నవంబర్ 24న ఆస్తుల రిజిస్టర్ చేశాడట. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త నిజం కాకూడదని ప్రార్థనలు చేస్తున్నారు. తమ దేవుడిని కష్టం రాకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నారు.