పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం వసంతవాడ వాగులో ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన ఆరు మృతదేహాలను వెలికితీశారు. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. దేవీ నవరాత్రుల పురస్కరించుకుని కొన్ని కుటుంబాలు వాగు సమీపంలో వనభోజనాలకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వాగులో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు గొట్టుపర్తి మనోజ్ (15), కూనవరపు రాధాకృష్ణ (15), కర్నాటి రంజిత్ (16), శ్రీరాముల శివాజీ (17), గంగాధర వెంకట్ (15), కెల్లా పవన్ (17)గా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.