English | Telugu
కరోనా వైరస్ కు సంబంధించి మరో సంచలన విషయం.. పరిశోధకుల వెల్లడి
Updated : Oct 17, 2020
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెల్సిందే. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వైరస్ కు సంబంధించి పరిశోధకులు కొత్తగా ఒక ఆందోళనకర విషయాన్నీ బయట పెట్టారు. ప్రస్తుతం
పాండమిక్ గా అంటే మహమ్మారిగా ఉన్న కరోనా వైరస్ భవిష్యత్తులో ఎండెమిక్ గా అంటే స్థానపరమైన వ్యాధిగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ వ్యాధి మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉందని ఆ పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం తట్టు వంటి వాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ దానిని పూర్తిగా నిర్మూలించలేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
కరోనా వైరస్ ఏదైనా ఒక ప్రదేశానికి పరిమితమై అది మళ్లీ మళ్లీ సంక్రమించే "ఎండెమిక్" లక్షణంగా మారే అవకాశం ఉందని కొలంబియా మెయిల్మాన్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఇలా మారడానికి రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ లభ్యత, దాని సమర్థత, సీజనాలిటీ వంటివి దోహదం చేస్తాయన్నారు.
నిజానికి వైరస్ సోకి కోలుకున్న తర్వాత వచ్చే రోగనిరోధకశక్తి కానీ, వ్యాక్సిన్ ద్వారా లభించే ఇమ్యూనిటీ కానీ ఏడాదిలోపే తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత కూడా ఇమ్యూనిటీ తగ్గుట వైరస్ సోకే అవకాశం ఉంటుందన్నారు. అయితే అదే సమయంలో ప్రాంతాలవారీగా స్థానిక కరోనా వైరస్ (ఎండెమిక్) వ్యాప్తి ద్వారా లభించే రోగనిరోధకశక్తి చాలా కాలం ఉండే అవకాశం ఉందని, అది సాధ్యమైతే కొన్ని సంవత్సరాలపాటు వైరస్ వ్యాప్తి రిపీట్ ఐన తర్వాత దానిని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని వారు వివరించారు. అయితే, దీనికి కూడా వ్యాక్సిన్ లభ్యత, దాని ప్రభావం వంటివి దోహదం చేస్తాయని వారు తెలిపారు. అయితే, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆ పరిశోధకులు తెలిపారు.